ఎమ్మెల్యే రోజాకు చెన్నైలో అవమానం
చెన్నై: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాకు చెన్నై విమానాశ్రయంలో అవమానం జరిగింది. ఆమె కారును విమానాశ్రయ అధికారులు వీఐపీ లాంజ్లోకి అనుమతించకపోవడంతో ఆమె చాలాసేపు విమానాశ్రయంలోనే వేచి వుండాల్సి వచ్చింది.
గురువారం హైదరారాబాద్ నుంచి చెన్నైకి వచ్చిన రోజాను తీసుకెళ్లేందుకు ఆమె సిబ్బంది విమానాశ్రయానికి వచ్చారు. వీఐపీల వాహనాలు పార్క్ చేసే లాంజ్లోకి రోజా కారును అనుమతించలేదు. అది ఎమ్మెల్యే వాహనమని సిబ్బంది చెప్పినా విమానాశ్రయాధికారులు ససేమిరా అన్నారు. దీంతో విమానాశ్రయం లోపలే చాలాసేపు వేచివున్న రోజా అధికారుల వద్దకెళ్లి అభ్యర్థించారు.
అయినా వారు వాహనాన్ని పార్క్ చేయనీయబోమని, కావాలంటే గేటు వరకూ వాహనం తెచ్చుకుని రోజాను తీసుకెళ్లవచ్చని సూచించారు. దాంతో కిమ్మనకుండా వచ్చిన రోజా బయట మాత్రం సంబంధిత అధికారులపై మండిపడ్డారు.