మల్లాది విష్ణుకు బంపర్ ఆఫర్!
Recommended Video
విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించే అవకాశం ఉంది. ఆయనను ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ సంస్థ ఛైర్మన్ పగ్గాలను అప్పగించవచ్చని తెలుస్తోంది. దీనితోపాటు ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా నియమించవచ్చని కూడా అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు నేడో, రేపో వెలువడం ఖాయమని చెబుతున్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నాయకులకు టికెట్లను ఇచ్చింది. వారిలో ఇద్దరు గెలవగా.. ఒకరు ఓడిపోయారు. గుంటూరు జిల్లా బాపట్ల నుంచి కోన రఘుపతి, విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు విజయం సాధించారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ద్రోణంరాజు శ్రీనివాస్ ఓడిపోయారు. కోన రఘుపతికి ఇప్పటికే మంచి పదవి లభించింది. ఆయన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరిస్తున్నారు.
తాజాగా మల్లాది విష్ణుకు బ్రాహ్మణ కార్పొరేషన్ సంస్థ ఛైర్మన్ గా నియమించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడవచ్చని తెలుస్తోంది. దీనితోపాటు- ఆయనను టీటీడీ బోర్డు సభ్యునిగా కూడా నియమించవచ్చంటూ వార్తలు వస్తున్నాయి. ద్రోణంరాజు శ్రీనివాస్ పేరును ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుందని చెబుతున్నారు. టీటీడీ పాలక మండలిలో సభ్యత్వం లేదా.. బ్రాహ్మణ కార్పొరేషన్ సంస్థ ఛైర్మన్ గిరీల్లో ఏదైనా ఒక పదవిని ద్రోణంరాజు శ్రీనివాస్ కు అప్పగించవచ్చని కూడా చెబుతున్నారు.