బాబు దొంగ ఏడ్పులకు స్పందిస్తారా?: నారా భువనేశ్వరికి రోజా కౌంటర్, ఏమన్నారంటే?
అమరావతి: తన సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కన్నీటిపర్యంతమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత నందమూరి కుటుంబం కూడా వైసీపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరుతున్నట్లు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు.. చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేశారని టీడీపీ మండిపడింది.

నారా భువనేశ్వరి వ్యాఖ్యలకు రోజా కౌంటర్
తాజాగా, నారా భువనేశ్వరి తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించడంతో వైసీపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పంచారు. ఆడవాళ్లను అనవసరంగా ఏడిపించిన వాళ్లు వారి పాపాన వాళ్ళే పోతారన్నారు. చంద్రబాబు హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. అప్పుడు మాట్లాడని భువనేశ్వరి, ఇప్పుడు చంద్రబాబు దొంగ ఏడుపులకు స్పందించడం ఏంటని ప్రశ్నించారు. అందుకే చంద్రబాబు 23 సీట్లకు పరిమితమయ్యారని మీరు గుర్తించాలని నారా భువనేశ్వరికి రోజా కౌంటర్ ఇచ్చారు.

భర్త దొంగ ఏడుపులకు స్పందిస్తారా? అంటూ భువనేశ్వరిపై రోజా
సీఎం జగన్ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వంగా పని చేస్తోందన్నారు రోజా. ఆడవాళ్లకు సముచిత స్థానం కల్పిస్తోందని.. మీ(నారా భువనేశ్వరి) భర్త చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఆడవాళ్లకు జరిగిన అన్యాయం గురించి మీరు ఎప్పుడూ మాట్లాడ లేదేంటని ప్రశ్నించారు. ఇప్పుడు మీరు గొప్పగా మాట్లాడుతుంటే అది మీ భ్రమే అవుతుందని రోజా వ్యాఖ్యానించారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి, మహిళా పార్లమెంటుకు పిలిచి అవమానపరిచి, అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన రోజు కనిపించని భువనేశ్వరి ఇప్పుడు జరగని దాన్ని జరిగినట్లు మాట్లాడితే నమ్మేవారు లేరన్నారు.
నీ భర్త దొంగ ఏడ్పులు ఏడిస్తే ఇప్పుడు మీరు మాట్లాడటం చూస్తుంటే చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం మామనే కాదు భార్యను కూడా రోడ్డున పెడుతున్నారని రాష్ట్ర ప్రజలు గమనించారన్నారు. ఇకనైనా భువనేశ్వరి జాగ్రత్తగా ఉండాలని నగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సూచించారు.

నారా భువనేశ్వరి ఏమన్నారంటే.?
ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై నారా భువనేశ్వరి స్పందించారు. తనను అవమానించిన వాళ్లు, వాళ్ల పాపాన వాళ్లే పోతారన్నారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. వాళ్లు వచ్చి సారీ చెబుతారని ఎదురుచూడటం లేదని, దానికోసం టైమ్ వేస్ట్ చేసుకోనని అన్నారు భువనేశ్వరి. ఆ వ్యాఖ్యలతో ఎంతో బాధపడ్డామని, ఎవరైనా మహిళల్ని గౌరవించాలని కోరారు.
నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. హెరిటేజ్ కంపెనీని కూలగొట్టాలని చాలా మంది చూశారన్నారు. భువనేశ్వరి. హెరిటేజ్ లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉన్నాయని, హెరిటేజ్ను ఎవరూ టచ్ చేయలేరని నారా భువనేశ్వరి తేల్చిచెప్పారు. దీంతో భువనేశ్వరి వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు వైసీపీ నేతలు.












Click it and Unblock the Notifications