రిషికేశ్వరి కేసులో గాడిదలు కాస్తున్నారా?: వైసీపీ ఎమ్మెల్యే రోజా
హైదరాబాద్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కలకలం రేపిన బీటెక్ ఆర్కిటెక్ విద్యార్ధిని ఆత్మహత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. శనివారం ఈ విషయమై రోజా మీడియాతో మాట్లాడారు.
ఏపీ కేబినెట్లో ముగ్గురు మహిళా మంత్రులున్నా విద్యార్ధిని ఆత్మహత్యపై ఎవరూ మాట్లాడక పోడవం శోచనీయమని అన్నారు. గాడిదలు కాస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే, కేబినెట్ సమావేశంలో తప్పు ఎమ్మార్వోదేనంటూ తీర్మానం చేశారంటూ మండిపడ్డారు.
రిషికేశ్వరి కేసును హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించాలని, కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని రోజా అన్నారు. ఇప్పటివరకు రిషికేశ్వరి మృతి కేసులో నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. నాగార్జున యూనివర్సిటీ కులాల కుంపటిగా మారిపోయిందని రోజా ఆరోపించారు.
మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు విమానాశ్రయం కోసం భూములు లాక్కునే విషయంపై ఉన్న ఆసక్తి, రిషికేశ్వరి కేసు దర్యాప్తుపై లేదన్నారు. రిషికేశ్వరి ఆత్మహత్య ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత విశ్వవిద్యాలయానికి మంత్రి చుట్టుపుచూపుగా మాత్రమే వెళ్లివచ్చారని అన్నారు. మంత్రికి ఆకాశయానంపై ఉన్న ఆసక్తి విద్యార్ధుల సమస్యలపై లేదని రోజా ఆరోపించారు.
విశ్వవిద్యాలయంలో ఉన్న కులాల బోర్డులను స్వయంగా మంత్రి తొలగించాలని చెప్పినా, వాటిని ఎంత మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. రిషికేశ్వరి తల్లిదండ్రులు చెబుతున్న విషయాల ఆధారంగా నిష్పాక్షిపాతంగా విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.
రిషికేశ్వరి ఘటన జరిగి ఇన్ని రోజులైనా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించక పోవడం దారుణమని అన్నారు. సాక్ష్యాలను తారుమారు చేసేందుకే యూనివర్సిటీకి పది రోజులు సెలవులు ప్రకటించారని ఆమె తెలిపారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి శనివారం నుంచి పది రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు ఉన్నతాధికారులు నిర్ణయించారు. రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనతో గత మూడు రోజులుగా విశ్వవిద్యాలయంలో ఆందోళనలు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.