అది చంద్రన్న వైన్ షాపా.. లోకేష్ బెల్టు షాపా.. : బోండా ఉమాకు రోజా కౌంటర్..
తెలుగుదేశం పార్టీ నాయకులకు అధికారం పోయిన తర్వాత పిచ్చెక్కిందని వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా అన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారన్న ఇంగీత జ్ఞానం లేకుండా.. బోండా ఉమా ప్రెస్ మీట్ మందు బ్రాండ్లతో ప్రెస్మీట్ పెట్టడం సిగ్గుచేటన్నారు. బోండా ఉమా ప్రెస్ మీట్ చూస్తుంటే.. వైన్ షాపులోనో లేదా బార్ షాపులోనో సేల్స్మెన్లా కనిపించాడని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలంగా కల్లు తాగిన కోతుల్లా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

పార్టీ ఆఫీసా లేక చంద్రన్న వైన్ షాపా..?
ఏకంగా తెలుగుదేశం ఆఫీసులోనే బోండా ఉమా మందు బాటిళ్లు పెట్టుకుని మాట్లాడుతుంటే.. అది పార్టీ ఆఫీసా లేక చంద్రన్న వైన్ షాపా..? లోకేష్ బెల్ట్ షాపా..? అన్న సందేహం కలుగుతోందన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యానికి బానిసైనవారిని డీ-అడిక్షన్ సెంటర్స్కు పంపించాలనుకున్నామని.. కానీ ఈరోజే ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నామని చెప్పారు. మద్యం కమిషన్లకు బానిసై కొట్టుకుంటున్న టీడీపీ వాళ్లను కూడా డీఎడిక్షన్ సెంటర్స్కు తీసుకెళ్లాలనుకుంటున్నామని చెప్పారు. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడే మందుపై రేట్లు తగ్గించాలని.. వైన్ షాప్స్ తక్కువ టైమ్ తెరిచి ఉంటున్నాయని పదేపదే చెబుతున్నారన్నారు. ఆయన మాటలు చూస్తుంటే.. తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మాట్లాడుతున్నట్టు ఉందని విమర్శించారు.

టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడైనా బార్లను తగ్గించారా
మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా 43వేల బెల్టు షాపులను తీసివేసిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. కానీ జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన కొద్దిరోజులకే 43వేల బెల్టు షాపులను తీసివేయించారని గుర్తుచేశారు. అలాగే 20శాతం వైన్ షాపులు తగ్గించారని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడైనా బార్లను తగ్గించారా అని ప్రశ్నించిన రోజా.. వైసీపీ ప్రభుత్వంలో 40శాతం బార్లను తగ్గించారని చెప్పారు. కాబట్టి మద్యంపై మాట్లాడే అర్హత మీకు లేదని టీడీపీని ఉద్దేశించి కామెంట్ చేశారు. మహిళల గురించి ఆలోచిస్తూ పెద్ద మనసుతో కార్యక్రమాలు చేస్తున్న జగన్కు మహిళా లోకం హ్యాట్సాఫ్ చెబుతోందన్నారు.

మహిళల తాళిబొట్లు తెంచారని..
గత టీడీపీ హయాంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారిందన్నారు రోజా. ఒక ముఖ్యమంత్రి సంతకం చేస్తే ఐఎస్ఐ మార్క్ లా ఉండాలని అన్నారు. వైఎస్ఆర్ గతంలో రైతులకు ఉచిత కరెంట్పై సంతకం చేస్తే.. వెంటనే అమలు జరిగిందని గుర్తుచేశారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బెల్టు షాపులను నిర్మూలిస్తానని తొలి సంతకం చేసి... దిగిపోయేనాటికి 43వేల బెల్టు షాపులను సృష్టించారని మండిపడ్డారు. ప్రతీ ఏటా 20శాతం మద్యాన్ని పెంచుకుంటూ పోయి మహిళల తాళిబొట్లను తెంచారన్నారు.
Recommended Video


నిత్యావసర ధరలు పెరిగినట్టు ఎందుకా గగ్గోలు..
మద్యం ధరలు పెరిగితే నిత్యావసర ధరలు పెరిగినంత ఓవరాక్షన్ చేస్తున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ సంవత్సరం ఎక్సైజ్ అధికారులకు లిక్కర్ టార్గెట్లు పెట్టి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడారన్నారు. లిక్కర్ సిండికేట్లతో కలిసి దోచుకున్నారని ఆరోపించారు. ఆఖరికి తమ గ్రామ వలంటీర్లపై కూడా చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇకనైనా ఆ పద్దతి మానుకోవాలని హెచ్చరించారు. ఆదివారం కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న వలంటీర్లను.. మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారని,మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల రాబోతున్నాయని.. టీడీపీ మరోసారి ప్రజల ఛీత్కారానికి గురికాబోతుందని అన్నారు.












Click it and Unblock the Notifications