తోపుదుర్తి వర్సెస్ పరిటాల: వేడెక్కిన అనంతపురం రాజకీయాలు
అనంతపురం: అనంతపురం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జిల్లా రాజకీయాలపై గట్టిపట్టు ఉన్న పరిటాల కుటుంబం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి ఇప్పటి నుంచే సన్నాహాలను మొదలు పెట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉండగానే.. తమకు అనుకూలంగా ఉండే నియోజకవర్గాలను ఎంపిక చేసుకుంది. సొంత నియోజకవర్గం రాప్తాడుపైనా పట్టును కోల్పోనివ్వకుండా చూసుకుంటోంది. స్థానిక ఎమ్మెల్యేను టార్గెట్గా చేసుకుంది.
రాప్తాడులో ఓటమితో..
పెనుకొండ ఎస్సీ రిజర్వుడ్గా మారడంతో పరిటాల కుటుంబం.. రాప్తాడు నియోజకవర్గానికి వలస వెళ్లాల్సి వచ్చింది. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి పరిటాల సునీత ఈ స్థానం నుంచి పోటీ చేసి, ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. తన కుమారుడు పరిటాల శ్రీరామ్ను ఎన్నికల బరిలో దింపారు.
చేదు ఫలితాన్ని చవి చూశారు. తన అరంగేట్రం ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ దారుణంగా పరాజయాన్ని చవి చూశారు. 25 వేలకు పైగా ఓట్ల తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
రాప్తాడులో తోపుదుర్తి పాగా..
ఆ తరువాత రాప్తాడు నియోజకవర్గంలో సమీకరణాలు భారీగా మారిపోయాయి. ఆత్మకూరు, రాప్తాడు, కనగానపల్లి, చెన్నే కొత్తపల్లి, రామగిరి మండలాల్లో వైసీపీ బలపడింది. ప్రత్యేకించి- పేరూరు రిజర్వాయర్కు కర్ణాటక నుంచి అదనపు నీటిని విడుదల చేయించుకోవడంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విజయం సాధించడంతో.. ఈ ప్రాంతలో ఆయన పేరు మారుమోగిపోతోంది. దశాబ్దాల నాటి కలను తోపుదుర్తి సాకారం చేశారంటూ ఈ ప్రాంత రైతులు, ఇతర వర్గాల వారు అభిమానిస్తున్నారు.
తోపుదుర్తిని ఎదుర్కొనడం కష్టమే..
ఈ పరిణామాలతో తోపుదుర్తిని ఢీ కొనడటం కష్టమేనని పరిటాల కుటుంబం భావించినట్టుంది. అందుకే తన వ్యూహాన్ని మార్చుకుంది. పొరుగునే ఉన్న ధర్మవరం నియోజకవర్గంపై దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచి పోటీ చేయడానికి సమాయాత్తమౌతున్నారంటూ కొద్ది రోజులుగా జిల్లాలో విస్తృతంగా ప్రచారం సాగింది. దీనికి అనుగుణంగా శ్రీరామ్ ఈ నియోజకవర్గం మండలాల్లో విస్తృతంగా పర్యటించారు.
తోపుదుర్తి వర్సెస్ పరిటాల
రాప్తాడులో తోపుదుర్తి, పరిటాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నారు. పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓటమి తప్పదంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తేల్చి చెప్పారు. రాజకీయాలను అడ్డుగా పెట్టుకుని ఆ కుటుంబం చేసిన అక్రమాలు, భూదోపిడీ మీద పరిటాల వీరగాధల పేరుతో రోజూ ఒక్కో ఎపిసోడ్ను వివరిస్తానని తోపుదుర్తి చెప్పారు. పరిటాల రవీంద్ర రాజకీయాల్లోకి వచ్చిన తరువాతే ఆస్తులు పెరిగాయని జిల్లాలో అందరికీ తెలుసునని అన్నారు.
ముదిగుబ్బ సభ అట్టర్ ఫ్లాప్..
ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని ముదిగుబ్బలో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని తోపుదుర్తి వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి స్పందన లభించకపోవడంతో మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్.. కదిరి నియోజకవర్గం నుంచి జనాన్ని సమీకరించుకోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ప్రవేశించడానికి ముందు రవీంద్ర హవాయ్ చెప్పులతో తిరిగే వాడని, ఆ తరువాతే వేల కోట్ల రూపాయలను వెనకేసుకున్నారని విమర్శించారు.
భూ ఆరోపణలపై..
తనకు వందల ఎకరాల భూములు ఉన్నాయంటూ పరిటాల శ్రీరామ్ చేసిన ఆరోపణలను తోపుదుర్తి తిప్పికొట్టారు. తాను పుట్టుకతోనే శ్రీమంతుడినని అన్నారు. తాను పుట్టే నాటికే 200 ఎకరాలు ఉన్నాయని చెప్పారు. భూస్వాములపై వ్యతిరేకంగా పరిటాల కుటుంబం పోరాడి ఉంటే- ఆ కుటుంబానికి ఇన్ని ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. పరిటాల కుటుంబం చేసిన అవినీతి, అక్రమాలపై వారం వారం ఆధారాలతో మీడియా ముందు ఉంచుతానని పేర్కొన్నారు.