స్థానిక ఎన్నికల నిర్వహణ పై వైసీపీ బిగ్ ట్విస్ట్, వాట్ నెక్స్ట్..!!
ఏపీలో స్థానిక ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ప్రభుత్వం అక్టోబర్ నెలాఖరు లోగా ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది. అటు వైసీపీ సైతం ఎన్నికలకు సిద్దం అవుతోంది. పార్టీ నేతలకు సీఎం జగన్ కీలక దిశా నిర్దేశం చేసారు. బీసీ రిజర్వేషన్ల వ్యవహారం కోర్టుకు చేరింది. ఇదే సమయంలో వైసీపీ తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారుతోంది. ఈ వ్యవహారంలో ఇక చోటు చేసుకునే పరిణామాల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.
ఏపీలో స్థానిక ఎన్నికల పైన కసరత్తు కొనసాగుతోంది. పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. అటు కూటమి ఏకపక్షంగా విజయం సాధించేందుకు వ్యూహ రచన చేస్తోంది. మాజీ సీఎం జగన్ పార్టీ నేతలకు కీలక హెచ్చరికలు చేసారు. ఏకగ్రీవాలు జరిగితే ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ లకు వచ్చే ఎన్నికల్లో సీటు ఉండదని తేల్చి చెప్పారు. కాగా.. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం మరోసారి న్యాయస్థానం ముందుకు వెళ్లింది. రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పూర్తై, తుది ఓటర్ల జాబితా విడుదలైన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పాత ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడాన్ని ఈ పిటిషన్లో వైసీపీ వ్యతిరేకించింది. ఇదే పిటిషన్లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 'సర్' ప్రక్రియ పూర్తి కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్ఈసీ) నిలువరించాలని కోరారు.

కోర్టుకు చేరిన వ్యవహారం.. నిర్ణయం పై ఉత్కంఠ
SIR ప్రక్రియ పూర్తికాకముందే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల ఓటర్ల జాబితాల్లో మార్పులు, తొలగింపులు, చేర్పుల ప్రభావం స్థానిక ఎన్నికలపై పడే అవకాశం ఉందని వైసీపీ వాదిస్తోంది. ఎన్నికల సంఘం జులై 1న కటాఫ్ గడువుగా తీసుకుని ఓటర్ల జాబితా సవరణ చేపడుతుంటే, ఎస్ఈసీ మాత్రం జనవరి 1వ తేదీని పరిగణనలోకి తీసుకోవడం సరైంది కాదని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న 'సర్' ప్రక్రియలో భాగంగా మరణించిన వారు, నకిలీ ఓటర్లు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తున్నారని, అదే విధంగా 18 ఏళ్లు నిండిన యువతను కొత్తగా ఓటర్లుగా చేరుస్తున్నారని పార్టీ వివరించింది. ఇటువంటి కీలక సమయంలో పాత జాబితాను ఉపయోగిస్తే, కొత్తగా అర్హత సాధించిన లక్షలాది మంది యువత తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య రిజర్వేషన్ల వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వైసీపీ తన పిటిషన్లో వాదించింది. దీంతో.. ఇప్పుడు ఈ పిటీషన్ పైన న్యాయస్థానం తీసుకొనే నిర్ణయం..ఎన్నికల నిర్వహణలో కీలకంగా మారనుంది.













Click it and Unblock the Notifications