రఘురామకు ఈటెలకు లింక్ .. పౌరుషం ఉంటే ఆ పని చెయ్యమని ఎంపీ మార్గాని భరత్ సవాల్
నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైన రెబెల్ నాయకుడు రఘురామ కృష్ణం రాజు పై వైసిపి చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయడం ఖాయమని వైసిపి చీఫ్ విప్ మార్గాని భరత్ స్పష్టం చేశారు.
రఘురామకు ఎంపీ మార్గాని భరత్ సవాల్
స్పీకర్ ఆర్టికల్ 10 ప్రకారం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు .రఘురామకృష్ణంరాజు స్పీకర్ ఓం బిర్లా ను కలిసినంత మాత్రాన ఆయనను బర్తరఫ్ చేయడం నిలిచిపోదని మార్గాని భరత్ చురకలంటించారు. అంతేకాదు రఘురామకృష్ణంరాజుకు తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు లింకు పెట్టి సవాల్ విసిరారు. రఘురామకృష్ణంరాజుకు పౌరుషం ఉంటే తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ లాగా రాజీనామా చేయాలని సవాల్ విసిరారు మార్గాని భరత్.
రఘురామ కృష్ణంరాజు డిస్ క్వాలిఫై ఖాయం
సీఎం జగన్మోహన్ రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం వల్లే రఘురామకృష్ణంరాజుకు ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. రఘురామపై అనర్హత వేటు వేయడం పై లోక్ సభ స్పీకర్ కు రిమైండర్ నోటీస్ కూడా ఇచ్చామని వెల్లడించారు. ఆర్టికల్ 10 ప్రకారం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న రఘురామకృష్ణంరాజు డిస్ క్వాలిఫై ఖాయమని మార్గాని భరత్ పేర్కొన్నారు.రాజీనామా చేసి పోటీ చేస్తే రఘురామకృష్ణం రాజు కు డిపాజిట్లు కూడా రావని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన ఎంపీ మార్గాని భరత్
ఇక ఇటీవలే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కు వైసీపీ ఎంపీ మార్గాన్ని భరత్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణంరాజు పై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు. అంతేకాదు రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణంరాజు వెంటనే డిస్ క్వాలిఫై చేయాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన రఘురామ కృష్ణం రాజుపై వైసీపీ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు .
లోక్ సభ స్పీకర్ ను కలిసి ప్రివిలేజ్ కమిటీ వెయ్యమన్న రఘురామ
ఇక మరోవైపు రఘురామకృష్ణంరాజు నిన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తో భేటీ అయి, తనపై జరిగిన దాడిపై ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు వైయస్సార్ సిపి వెబ్ సైట్ లో తన పేరు తొలగించడాన్ని కూడా రఘురామకృష్ణంరాజు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.