వారం రోజుల్లో రఘురామకు నోటీసులు-తర్వాత వేటు-వైసీపీ ఎంపీ మార్గాని భరత్
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే ధిక్కార స్వరం వినిపిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ పట్టు బిగిస్తోంది. తనపై వైసీపీ ఎంపీలు ఇచ్చిన అనర్హత వేటు ఫిర్యాదుపై ఏమీ జరగదని ఆయన ధీమా వ్యక్తం చేస్తుండగా... పార్టీ ఎంపీ మార్గాన్ భరత్ మాత్రం ఇవాళ బాంబు పేల్చారు.
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై తాము ఇచ్చిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ నుంచి వారం రోజుల్లో నోటీసులు వస్తాయని పార్టీ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు. రఘురామ వ్యవహారశైలిపై లోక్ సభ స్పీకర్ కు 290 పేజీలతో ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. దీనిపై లోక్ సభ స్పీకర్ స్పందించి వారం రోజుల్లో నోటీసులు ఇస్తారని ఆయన ఇవాళ ప్రకటించారు. గతంలో శరద్ యాదవ్ పై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వేటు వేసిన విషయాన్ని కూడా స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.

రఘురామకృష్ణంరాజు వైసీపీ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. వీటిని లోక్ సభ స్పీకర్ కు సమర్పించామన్నారు. గతంలో జరిగిన ఘటనలతో పాటు రఘురామ చర్యలు, వ్యాఖ్యల్ని కూడా స్పీకర్ కు స్పష్టంగా వివరించామన్నారు. దీంతో రఘురామరాజుకు వారం రోజుల్లో నోటీసులు జారీ చేసి స్పీకర్ వివరణ తీసుకుంటారని, ఆ తర్వాత స్పీకర్ విచక్షణాధికారంతో వేటు వేస్తారని భరత్ వెల్లడించారు. దీంతో రఘురామరాజుపై ఈసారి వేటు తప్పదని వైసీపీ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications