'జగన్కు భయపడే రాష్ట్రాన్ని విభజించారు': '1000 ఫించన్లో 100 నొక్కేస్తున్నారు'
అమరావతి: ఉమ్మడి ఏపీకి వైయస్ జగన్ సీఎం అవుతారనే రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో కొనసాగుతున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడారు.
విభజన సమయంలో ఏపీకి ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ అంటే, కాదు పదేళ్లు ఇవ్వాలని బీజీపే అడిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విభజన అనంతరం ప్రత్యేకహోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ అంటున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మేకపాటి అన్నారు. అయితే ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టలేదని బీజేపీ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందన్నారు. హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదని, దాన్ని సాధించాల్సిన బాధ్యత టీడీపీ అధినేత చంద్రబాబుదేనన్నారు.
ఏపీకి హోదా కోసం ప్రజలు ఆశగా చూస్తున్నారని, హోదా సాధించే వరకు వైసీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందన్నారు. ఏపీకి హోదా విషయంలో ప్రధాని మోడీ, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని వైఎస్ జగన్ కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని మేకపాటి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
టీడీపీకి ప్రత్యేక హోదాపై ఏమాత్రం చిత్తశుద్ధిలేదని, ఓ వైపు చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేస్తూ, మరోవైపు అప్రజాస్వామిక చర్యలు చేపడుతున్నారన్నారు. ఓ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి, కొనుగోలు చేయడం ఎంతవరకూ సమంజసమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో చంద్రబాబు విఫలమైతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు.
ధర్మాన లా పాయింట్ తీశారు
ప్రభుత్వ దొంగ విధానాలను ప్రజలకు చెప్పడమే ప్రతిపక్షం బాధ్యత అని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించిన ఆయన, చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. పట్టిసీమ ప్రాజెక్టును కమీషన్ల కోసమే చేపట్టారని విమర్శించారు.
పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు అన్యాయమైన పాలన చేస్తున్నారు.
ప్రతి పనిలో టీడీపీ నేతలకు ముడుపులు అందుతున్నాయని, ఆఖరికి వృద్ధులకు ఇస్తున్న రూ. 1000 పింఛన్లో గ్రామ కమిటీలు రూ. 100 నొక్కేస్తున్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ప్రజలు జీవిస్తున్నారన్నారు. ఏపీలో జీడీపీ పెరిగిందని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం, ఆ మేరకు ఆదాయం పెరిగినట్టు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.
ఆదాయం పెరిగితేనే జీడీపీ పెరుగుతుందన్న విషయం తెలియని ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తుండటం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. 24 గంటల విద్యుత్ విషయంలో చంద్రబాబు చేసిందేమీ లేదని చెప్పిన ధర్మాన.. చంద్ర బాబు మహానాడు వేదికగా విద్యుత్ పై గొప్పలు చెప్పుకున్నారని మండిపడ్డారు.
గత ప్రభుత్వాలు చేసిన మంచి పనుల వల్ల ఈ రోజు అవసరానికి మించి దేశంలో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేస్తే, ఆ తర్వాత సీఎంగా పగ్గాలు చేపట్టిన వైయస్ ఆ వ్యవస్థలకు మళ్లీ జీవం పోశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు వితండ వాదం చేస్తున్నారని విమర్శించారు.