చంద్రబాబు, నారా లోకేష్, పవన్..స్టేట్ టూరిస్టులు: విహారానికి అప్పుడప్పుడు ఏపీకి: వైసీపీ ఎంపీ
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్పై వైఎస్ఆర్సీపీ లోక్సభ సభ్యుడు నందిగం సురేష్ విమర్శలను సంధించారు. ఈ ముగ్గురి అవసరం రాష్ట్రానికి లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి పర్యాటకులుగా మారిన ఈ ముగ్గురు నాయకులను ప్రజలు మరోసారి ఛీ కొట్టారని అన్నారు. బద్వేలు ఉప ఎన్నికతో ఈ విషయం మరోసారి నిరూపితమైందని చెప్పారు.

వారి అవసరం రాష్ట్రానికి లేదు..
ఈ మధ్యాహ్నం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్.. రాష్ట్రానికి టూరిస్టులుగా వచ్చిపోతున్నారని, వారి అవసరం తమకు లేదని ప్రజలు స్పష్టం చేశారని అన్నారు. అందుకే రాష్ట్రంలో ఎన్నికలు జరిగే ప్రతీసారీ ఆ రెండు పార్టీలను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు స్టేట్తో అవసరం లేదని. ఆయన పని చేస్తోన్నది, పార్టీని నడుపుతోన్నది రియల్ ఎస్టేట్ కోసమేనని విమర్శించారు.

రియల్ ఎస్టేట్ ధందా కోసం..
రియల్ ఎస్టేట్ కోసమే అమరావతి కొంపముంచాడని నందిగం సురేష్ ఆరోపించారు. అమరావతిలో ఉన్న తన బినామీల భూముల కోసం చంద్రబాబు తపన పడుతున్నాడే తప్ప అది రాష్ట్రం కోసం కాదని చెప్పారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా డబ్బులు ఇచ్చి ప్రజలను తరలించే దుస్థితికి చంద్రబాబు దిగజారిపోయాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయ పతనం గురించి చెప్పుకోవడానికి ఇంతకంటే మరో ఉదాహరణ లేదని అన్నారు.

అభివృద్ధికి ప్రధాన అడ్డంకి చంద్రబాబే..
రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ప్రధాన అడ్డంకిగా మారాడని నందిగం సురేష్ విమర్శించారు. ఆయన ఏ రకంగా ఆటంకం కలిగిస్తున్నారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఎన్నికలకు దూరం అంటూనే భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికాడని, బానిసత్వం చేయడానికి అప్పుడప్పుడు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ను దింపుతుంటారని ఆరోపించారు. చంద్రబాబు బుద్ధి ఎలాంటిదో ప్రజలకు తెలిసిపోయిందని పేర్కొన్నారు. విహారయాత్రకు వచ్చినట్టుగా చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రుడు పవన్ ఈ రాష్ట్రానికి వస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రజలకు చేరువగా వైఎస్ జగన్..
ఆ ముగ్గురు నాయకులు కూడా తమ నివాసాలను పక్క రాష్ట్రంలో కట్టుకుని హాయిగా కాలం వెల్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, రామోజీరావు నివాసాలు కూడా హైదరాబాద్లోనే ఉన్నాయని, వీరంతా ఏపీకి సంబంధం లేని వ్యక్తులని, ప్రజలు ఈ విషయాన్ని గమనించారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. 2019 ఎన్నికలకు ముందే తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని ఉంటున్నారని, ప్రజలకు నిత్యం చేరువగా ఉంటున్నారని గుర్తు చేశారు.

ఆ ముగ్గురికీ ఓటు హక్కు ఎక్కడుందో తెలుసు..
వైఎస్ జగన్కు పులివెందులలో ఓటు హక్కు ఉంటే- చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్కు ఎక్కడ ఉందని నందిగం సురేష్ ప్రశ్నించారు. చంద్రబాబు గానీ, ఆయన కుటుంబ సభ్యుల ఓట్లు గానీ.. సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా లేవని స్పష్టం చేశారు. ఆ ముగ్గురూ పక్క రాష్ట్రంలో ఓటు హక్కును వినియోగించుకుంటారని గుర్తు చేశారు. అమరావతి ప్రాంతంలో దళితులు, బలహీనవర్గాల ప్రజలు నివాసముంటే.. మురికికూపాలుగా మారి అభివృద్ధి ఆగిపోతుందని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.

బద్వేలు ఫలితంతో మైండ్ బ్లాక్..
చంద్రబాబు భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఎవరినీ ఓటు అడగడని, తన చుట్టు ఉన్నవారిని మాత్రమే ఓటు అడుగుతాడని వ్యాఖ్యానించారు. తన బినామీ రాజధాని కోసం అందరినీ చిన్నచూపు చూసిన చంద్రబాబు రాష్ట్రానికి అవసరం లేదని ప్రజలు తీర్పు ఇచ్చారని, బద్వేలు ఉప ఎన్నిక ఫలితంతో ఆయన మైండ్ బ్లాక్ అయిపోయిందని నందిగం సురేష్ చెప్పారు. చంద్రబాబు ఒక్కడే అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నాడని, దానికి కారణం..బినామీ ఆస్తులేనని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications