రఘురామ అరెస్టు: చంద్రబాబును లింక్ చేస్తూ టీడీపీ వెలగపూడి వ్యాఖ్యలు -సీఎం జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్
అధికార వైసీపీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రతినిత్యం విమర్శలు, తీవ్రస్థాయి ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సర్కారు ఎట్టకేలకు అరెస్టు చేయించింది. ఏపీ సీఐడీ పోలీసుల బృందం శుక్రవారం హైదరాబాద్ లో రఘురామను అరెస్టు చేసి, విజయవాడకు తరలించింది. ముందస్తు నోటీసులు, లాయర్లతో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రఘురామను అరెస్టు చేసి తీరును చంద్రబాబు నాయకత్వంలోని ప్రతిపక్ష టీడీపీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబులు కీలక వ్యాఖ్యలు చేశారు..

రఘురామపై కేసులు ఇవే..
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు శుక్రవారం అరెస్టుచేయడం తెలిసిందే. ఆయనపై 124 ఐపీసీ-ఏ సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. సీఆర్ పీసీ 50(2) ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అలాగే ఇతరులతో కలిపి కుట్ర(120బీ) చేశారని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యలు(124ఏ) చేశారని, ఇతరుల మధ్య విద్వేషాలు కలిగించేలా వ్యాఖ్యలు(153ఏ) చేశారని, వ్యక్తిగత దూషణ(505)లకు పాల్పడ్డారని అభియోగాలు మోపి వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రఘురామ దాఖలు చేసిన 'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్ విచారణ కీలక దశకు చేరిన తరుణంలో ఈ అరెస్టు కీలకంగా మారింది. దీనిపై..

సీఎం, పోలీసులపై అచ్చెన్న ఫైర్..
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును అరెస్టు చేయడంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని, ఏపీలో జగన్రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రూల్ ఆఫ్ లా లేదు.. అంతా రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తోందంటూ మండిపడ్డారు. రఘురామ అరెస్ట్ కక్ష సాధింపులో భాగంగానే జరిగిందని ఆరోపించారు. వారెంట్ లేకుండా ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. పోలీసులు ఖాకీ డ్రెస్సును పక్కనపెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, ఇది నిజంగా శోచనీయమని అచ్చెన్నాయుడు అన్నారు. ఇక,

చంద్రబాబును అన్నందుకు జగన్పైనా
ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనూహ్య వ్యాఖ్యలు చేశారు. అరెస్టును ఖండించిన వెలగపూడి.. ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నమని మండిపడ్డారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్, ఇతర వైసీపీ నేతలు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు తాము ఎన్నిసార్లు సీఐడీ అరెస్టులు చేయాలి? అని వెలగపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులపై పెట్టే దృష్టి కరోనా నియంత్రణపై పెడితే ప్రజల ప్రాణాలనైనా కాపాడేవారేమోనని వెలగపూడి అన్నారు.












Click it and Unblock the Notifications