సీఎంగా వైఎస్ భారతి లేదా విజయమ్మ - సారీ చెప్పకుంటే జగన్ పదవి పోవడం ఖాయం: ఎంపీ రఘురామ
ఏపీ హైకోర్టులోని ఐదుగురు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జి, కాబోయే సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తెలంగాణకు చెందిన ఒకరిద్దరు అడ్వొకేట్లు తప్ప దేశంలోని వివిధ బార్ కౌన్సిళ్లు జగన్ తీరును తప్పు పడుతూ ఫిర్యాదులు చేస్తున్నాయని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కోర్టు ధిక్కార నేరం రుజువైన తర్వాత జగన్ సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని, అప్పుడు ఆయన కుటుంబీకులే పదవిని చేపట్టే అవకాశముందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

ఇన్ సైడర్ ట్రేడింగ్ ఛాన్సే లేదు
‘‘ఏపీ సీఎం చర్య ముమ్మాటికి కోర్టు ధక్కారమే. స్వలాభం కోసం వ్యక్తులు ఇలా జడ్జిలను అవమానించడం, అనుచిత ఆరోపణలు చేయడం ఖండనీయం. త్వరలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానున్న తేలుగుతేజం(జస్టిస్ ఎన్వీ రమణ)పై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడో గుంటూరులో అమరావతి ఉంటే, దానికి 50 కిలోమీటర్ల దూరంలో జడ్జి పిల్లలు భూములు కొంటే దాన్ని కావాలనే వివాదం చేస్తున్నారు. అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది షేర్ మార్కెట్ కు సంబంధించిందే తప్ప రియల్ ఎస్టేట్ లో దానికి అవకాశమేలేదు. ఒకవేళ జరిగినా అది నేరం కానేకాదు.

దేశవ్యాప్త ఆందోళన..
10 లేదా 15 రోజుల తర్వాతైనా ఈ వ్యవహారం కొలిక్కి రావొచ్చు. ఈలోపే దేశవ్యాప్తంగా అడ్వొకేట్లు ఉద్యమం చేపటొచ్చు. న్యాయవ్యవస్థపై దాడికి ప్రయత్నించిన వ్యక్తులపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని న్యాయవాదులు అందరూ నినదించబోతున్నారు. ఈ వ్యవహారంలో ఏపీ సీఎం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు కచ్చితంగా తేలుతుంది. బహుశా శిక్ష వేరేలా ఉండొచ్చు. ప్రశాంత్ భూషణ్ మాదిరిగా ఒక్క రూపాయి జరిమానాతోనో, గంట సేపు కోర్టు హాలులో నిలబడం లాంటి శిక్ష పడొచ్చు. కానీ ఒక్కసారి కోర్టు ధిక్కరణకు పాల్పడిన వ్యక్తి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అనర్హుడవుతారు.

విజయమ్మ లేదా భారతి..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 13 ప్రకారం, వివిధ చట్టాల ప్రకారం.. పదవిలో ఉన్న వ్యక్తులు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పాల్పడితే అనర్హులు అవుతారు. సూర్యుడు అస్తమించడం ఎంత నిజమో, సీఎం జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు తేలబోతుండటం కూడా అంతే నిజం. దీన్ని ఎవరూ కాదనలేరు. దీనిని పర్యవసానంగా సీఎం జగన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. దీనికి పరిష్కారం ఏంటంటే.. జగన్ ఇప్పటికైనా గుడ్డి సలహాదారుల్ని పక్కనపెట్టి.. తప్పు జరిగింది, క్షమించండని కోర్టును కోరాలి. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే.. ప్రత్యాత్నమాయంగా వైఎస్ విజయమ్మ లేదా వైఎస్ భారతినో ముఖ్యమంత్రి కావొచ్చు. వైఎస్సర్ సతీమణిగా విజయమ్మ, తెలివైన, సమర్థురాలైన వనితగా భారతి ఆ పదవిలో రాణిస్తారనే నా అభిప్రాయం.

ఐ లవ్ జగన్.. అందుకే ఇలా..
వివేకా హత్య కేసును సెక్షన్ 174 కింద నమోదు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. దివ్య తేజస్విని ఘటన వెనుక కూడా న్యాయవ్యవస్థ లోపం ఉన్నట్లు వైసీపీ వాళ్లు మాట్లాడటం సిగ్గుచేటు. నన్ను పదవి నుంచి తప్పించాలని మా పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా పర్వాలేదు. నామీద వైసీపీ నేతలు ఎవరేం మాట్లాడినా జంతువులు మాట్లాడినట్లే భావిస్తా. అయితే ఈ సలహాదారులు, భజనపరులు జగన్ సీఎం పదవి పోయేదాకా ఇలానే ఇడియట్స్ లాగా వ్యవహరించొద్దని కోరుతున్నా. ఎందుకంటే జగన్ ను నేను అమితంగా ప్రేమిస్తున్నాను. ఆయన కలకాలం సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నాను'' అని ఎంపీ రఘురామరాజు అన్నారు.












Click it and Unblock the Notifications