ఎంపీ రఘురామకు జగన్ మరో షాక్ -ప్రధాని అయ్యే అవకాశమింతే -అంబేద్కర్ సనాతన హిందువేనంటూ
సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేయడమే కాకుండా, సీబీఐ కేసుల్లో బెయిల్ కూడా రద్దు చేయాలంటూ రచ్చకెక్కిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మరో భారీ షాక్ సిద్దమైంది. పార్టీ లైన్ కు విరుద్ధంగా పార్లమెంటులో మాట్లాడిన ఆయనపై ఇప్పటికే అనర్హత వేటు ఫిర్యాదు ఉండగా, తాజగా జగన్ బెయిల్ రద్దు వ్యవహారంలోనూ రఘురామపై చర్యలకు సీఎం జగన్ ఆదేశించినట్లు వెల్లడైంది.
ఈ విషయాలను స్వయంగా ఎంపీనే తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ కు సంబంధించిన వ్యవహారాలతోపాటు అంబేద్కర్ జయంతి, అచ్చెన్నాయుడు వీడియో లీక్, తిరుపతి ఉప ఎన్నిక అంశాలపైనా అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే...
video leak: జగన్, దొంగ సాక్షి విష పన్నాగం -నారా లోకేశ్తో విడదీయలేరు: టీడీపీ అచ్చెన్నాయుడు రియాక్షన్
రాజుగారి సాయంతో చదువులు..
''ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్ జయంతి మన దేశానికి చాలా ముఖ్యమైన రోజు. ఆరోజుల్లో బరోడా మహారాజు అందించిన ఆర్థిక సహకారంతో అంబేద్కర్ విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు అభ్యసించారు. జ్యూరిస్ట్, ఎకనామిస్త, గొప్ప సోషల్ రిఫార్మర్ ఆయన. ఒక వ్యక్తిలో ఇన్ని వ్యక్తిత్వాలు ఉండబట్టే ఆయన భారతరత్నగా పరిగణించబడ్డారు. వివక్షకు గురైన దళితులకే కాదు, మహిళలకూ సమాన హక్కులు, రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడు. అంతకుముందు బ్రహ్మనాయుడు, వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వాళ్లు వర్ష వివక్షను తప్పుపట్టినా, దాన్ని రాజ్యాంగబద్ధం చేసింది అంబేద్కరే. జెండర్, ఆస్తితో నిమిత్తం లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించారు. యావత్ జాతికి సొత్తు లాంటి మహనీయుడిని కొందరివాడిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది..
అంబేద్కర్ సనాతన హిందువే..
కేవలం కొన్ని కాలనీలకే అంబేద్కర్ విగ్రహాలను పరిమితం చేయడం తగదు. అన్ని చోట్లా ప్రధాన కూడళ్లలో అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్టించాలి. సంకుచిత మత భావనలను అంబేద్కర్ కు ఆపాదిస్తూ, ఆయన నమ్మని మతానికి చెందినవాళ్లు హడావుడి చేస్తున్నారు. అంబేద్కర్ బుద్ధిజాన్ని స్వీకరించాలని 1936లో అనుకుని, 1956లోగానీ స్వీకరించలేదు. నిజానికి బౌద్ధం.. సనాతన ధర్మానికి కొనసాగింపు లాంటిదే. బౌద్ధధర్మం, సనాతన ధర్మానికి పెద్దగా తేడాల్లేవు. క్రిస్టియానిటీలో క్యాథలిక్, ప్రొటెస్టెంట్ల వంటివే అవి. విష్ణుమూర్తి దశావతారాల్లో బుద్ధుణ్ని కూడా అవతారంగా గుర్తించారు. మన జాతీయ జెండాలోని ధర్మ చక్రం బుద్దిజానికి సింబల్. అంబేద్కర్ చనిపోయేదాకా ప్రాక్టీస్ హిందూగా జీవించారు. రాజ్యాంగ నిర్మాత హిందువు అని చెప్పుకోడానికి గర్విస్తున్నాం. చివర్లో ఆయన హీనయాన, మహాయాన బుద్దిజాన్ని కాకుండా నవయాన బుధ్దిజాన్ని స్వీకరించారు. అయితే, అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓండిచిన దేశం మనది. దాన్ని బట్టి ఓడినవాళ్లంతా చేతగానివాళ్లు కారని, గెలిచినవాళ్లు గొప్పవాళ్లు కదని అర్థమవుతుంది. ఏపీలో..
జగన్పై వి'ప్లవ' పోరాటం: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ పిలుపు -కామెడీ పీస్ అంటూ విజయసాయిరెడ్డి ఫైర్
రాజ్యాంగం మాట్లాడినందుకే నాపై వేటు
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ లో తూట్లు పొడుస్తున్నారు. ప్రాధమిక హక్కులకు విలువ ఇవ్వడంలేదు. మాతృభాషకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 350(ఏ) గురించి పార్లమెంటులో మాట్లాడినందుకు మా వైసీపీ వాళ్లు నాపై అనర్హత పిటిషన్ వేశారు. అలాంటి వ్యక్తులు ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అంటూ నాటకాలు చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టే 100కుపైగా కేసుల్లో జగన్ సర్కారుకు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే.. దాన్ని సరిగా అమలు చేయడమే అన్న విషయాన్ని ముఖ్యమంత్రి ఇప్పటికైనా గుర్తించాలి. అలా కాకుండా..
రఘురామపై మరోసారి అనర్హత పిటిషన్..
రాజ్యాంగాన్ని మాట్లాడినందుకు నాపై అనర్హత పిటిషన్ వేసిన వైసీపీ వాళ్లు.. సీఎం జగన్ ఆదేశాలతో మరోసారి అదే పిటిషన్ వేయబోతున్నట్లు నాకు సమాచారం అందింది. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టుకు వెళ్లినందుకుగానూ, దాన్ని పార్టీ వ్యతిరేక చర్యగా భావిస్తూ అనర్హత వేటేయాలని ఫిర్యాదు చేస్తారట. వీళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నేను రాజీనామా చేసేదాకా నా పదవికి వచ్చిన ముప్పేమీ లేదు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలనే రిఫరెండంపై రాజీనామా చేయడానికి నేను సిద్దంగా ఉన్నానని, ఒకవేళ నేను గెలిస్తే, వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలూ రాజీనామాలకు సిద్ధమా? అన్న సవాలుకు ఇప్పటిదాకా స్పందన లేదు. చట్టం ముందు అందరూ సమానులే, ఒక నిందితుడు కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకోవడం, పదవిని అడ్డం పెట్టుకుని కేసును ప్రభావితం చేయడం షరతుల ఉల్లంఘనే అవుతుంది. పాలకులకు వేరుగా, సామాన్యులకు వేరుగా రూల్స్ ఉండదారన్న ఉద్దేశంతోనే నేను జనగ్ బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేశాను..
జగన్ సౌతాఫ్రికా అధ్యక్షుడూ కావొచ్చు..
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరికి ఇంకా జీతాలు అందలేదు. ఈ దుస్థితిలోనే, ప్రజా ధనాన్ని తీసుకెళ్లి జగనన్న సైన్యాలు అనబడే వాలంటీర్లకు భారీ నజరానాలుగా పంచుతున్నారు. వాలంటీర్లకు సన్మాన సభలో మంత్రులు, మంత్రి పదవులు ఆశించేవాళ్లు పోటాపోటీగా జగన్ ను పొగిడారు. ఒకాయనైతే ఏకంగా జగన్ ప్రధాని అవుతారని చెప్పారు. అసలు సీఎంగా ఏం చేస్తానన్నారో ముందు ఆ పనులు చేయాలని జగన్ కు నా విన్నపం. చెప్పిన పనులన్నీ చేసిన తర్వాత ఆయన ప్రధాని కావొచ్చు లేదా, యూఎస్ పౌరసత్వం తీసుకుని అమెరికా అధ్యక్షుడు కావొచ్చు లేదంటే తనకెంతో ఇష్టమైన సౌతాఫ్రికాకు అధ్యక్షుడూ కావొచ్చు. కేంద్రంలో మోదీ-షా కాంబినేషన్ పటిష్టంగా ఉన్నంత కాలం జగన్ ప్రధాని అయ్యేందుకు 0.01శాతం కూడా అవకాశం లేదు. మరో ముఖ్యమైన అంశం..
గొడ్డలి వేటును గుండెపోటుగా..
జగన్ బాబాయి వివేకానంద రెడ్డి హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారు అనేది అత్యంత ప్రధానమైన ప్రశ్న. ఈ హత్యాకాండలో జగన్ ప్రమేయం ఉంటుందని ఎవరికీ అనుమానం లేదు. కానీ గొడ్డలి వేటును గుండెపోటుగా విజయసాయిరెడ్డి ప్రకటించిన సమయంలో ఆయన లోటస్ పాండ్ లోనే ఉన్నారు. పోలీసుల కంటే ముందే మృతదేహాన్ని పరిశీలించిన డాక్టర్లకు అది హత్య అని తెలియకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. రాజ్యాంగాన్ని మాట్లాడినందుకు ఓసారి, జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలన్నందుకు రెండోసారి, వివేకా హత్య గురించి మాట్లాడినందుకు మూడోసారి నాపై అన్హత వేటు పిటిషన్ ఇస్తారేమో. ఏది ఏమైనా who killed babai అనేది తేలాల్సిందే. చివరిగా..
అచ్చెన్న వీడియో లీక్స్ బూమరాంగ్..
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ వాళ్లు చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. సీక్రెట్ కెమెరాలు పెట్టించి, ఏజెంట్లను పంపి వాళ్లతో మాట్లాడించడం లాంటి పన్నాగాలు బూమరాంగ్ అయి మళ్లీ వైసీపీకే తగులుతాయి. తిరుపతిలో భారీ మెజార్టీతో గెలుస్తామని వైసీపీ వాళ్లు చెబుతున్నారు. నా అంచనా ప్రకారం మెజార్టీ లక్ష ఓట్లు వచ్చినా వైసీపీ ఓడినట్లే లెక్క. తిరుపతిలో డబ్బులు పంచడానికి రెండు రోజుల్లో మూటలు దిగుతాయని తెలుస్తోంది. ఎన్నికల్లో డబ్బుల పంపిణీ ఒక దురాచంలా మారింది. ఎవరు డబ్బులిచ్చినా, స్నేహభావంతో తీసుకుని, ఓటు మాత్రం ఆ పార్టీకి వేయొద్దని ప్రజలకు నా విన్నపం'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.