జగన్కు భారీ షాక్: ఢిల్లీలో రఘురామ ఫిర్యాదుల పర్వం -ఎన్హెచ్ఆర్సీసీ పంత్తో భేటీ -నిర్వచనం మారితే?
సొంత పార్టీపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు, అతి తీవ్ర ఆరోపణలు చేసి, దేశద్రోహం కేసులో అరెస్టయి, సుప్రీంకోర్టు బెయిల్ పై విడుదలైన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం ఢిల్లీలో కేంద్రం పెద్దలను, జాతీయ సంస్థల అధినేతలను కలుస్తూ బిజీగా ఉన్నారు. నిన్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయిన రఘురామ.. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. తాజాగా, సోమవారం నాడు జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ పంత్ ను ఎంపీ కలిశారు. దేశద్రోహం కేసుల ఉదంతంలో జగన్ సర్కారుకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలిన వేళ రఘురామ ఫిర్యాదుల పర్వం ఎటుదారి తీస్తుందోననే ఉత్కంఠ కొనసాగుతున్నది..

థార్డ్ డిగ్రీ ప్రయోగించారు..
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ సోమవారం ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ జస్టిస్ పంత్తో సమావేశమై, ఏపీ సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరును వివరించారు. సీఐడీ పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన ఫిర్యాదు చేశారు. కాగా, మొత్తం వ్యవహారంపై విచారణ చేస్తామని ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ రఘురామతో అన్నట్లు సమాచారం. ఎంపీ అరెస్టు అనంతరం ఎన్హెచ్ఆర్సీకి ఆయన కుమారుడు భరత్ ఫిర్యాదు చేయడం, దానిపై కమిషన్.. ఏపీ ప్రభుత్వం, డీజీపీ, సీఐడీకి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

కేంద్రం పెద్దలకూ వినతులు..
గత వారం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి విడుదలై, నేరుగా ఢిల్లీ వెళ్లిన ఎంపీ రఘురామ, ఎయిమ్స్ లో చికిత్స పొందడం, ఆయన రెండు కాళ్లకు పీఓపీ కట్లు కట్టడం తెలిసిందే. కాళ్లు కదలపలేని స్థితిలో వీల్ చైర్ లోనే రఘురామ కేంద్రం పెద్దలను కలుస్తున్నారు. రక్షణ మంత్రితో భేటీ అయిన రోజే.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ఎంపీ లేఖలు రాశారు. నేరుగా కలవనిస్తే అరెస్టు విషయంలో ఏపీ పోలీసులు అనుసరించిన అనుచిత వైఖరి, జగన్ సర్కారు అసంబద్ధ వైఖరికి సంబంధించిన విషయాలను విన్నవించుకుంటానని రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఏపీ సర్కారు తీరుపై ఇ అనుచితాలనుతోపాటు ప్రధాని నరేంద్ర మోదీలను కూడా ఎంపీ అపాయింట్మెంట్ అడిగారు. ఇదిలా ఉంటే..

దేశద్రోహం నిర్వచనం మారితే..
ఎంపీ రఘురామపై ఏపీ సీఐడీ పెట్టిన దేశద్రోహం కేసులో ఏ2, ఏ3లుగా టీవీ 5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలు ఉండటం, తమపై నమోదైన ఎఫ్ఐఆర్ అక్రమమంటూ ఆ రెండు ఛానళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఇవాళ్టి విచారణలో జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ ధర్మాసనం జగన్ సర్కారుకు భారీ షాకిస్తూ, ఛానళ్లపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ విచారణపై స్టే విధించింది. 4వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, సీఐడీకి నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను 6 వారాలు వాయిదా వేసింది. అంతేకాదు, జగన్ సర్కారు తీరు మీడియా స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నంలా ఉందని, 'దేశద్రోహం' అభియోగాలకు సరైన నిర్వచనాన్ని చెప్పాల్సిన, దానికి పరిమితులను విధించాల్సిన సమయం కూడా ఆసన్నమైనట్లు భావిస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జడ్జిలు చెప్పినట్లు దేశద్రోహం కేసుల నిర్వచనం మారితే, ఏ1గా ఉన్న రఘురామపై ఆ ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications