చంద్రబాబు చేతులెత్తేశారు.. కుల మేధావి కిరసనాయిలు సలహాలే గతి.. లోకల్ పోరుపై వైసీపీ ఫైర్
ఏపీలో అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల పర్వానికి తెరలేచింది. ఈ నెల 21న ఎంపీటీసీ, జెడ్పీటీపీ ఎన్నికలు, 23న మున్సిపాలిటీ ఎన్నికలు, 27,29 తేదీల్లో రెండు విడతల్లో పంచాయితీ ఎన్నికలు జరుగనున్నాయి. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి సోమవారం(9వ తేదీ) నుంచి నుంచి బుధవారం(11వ తేదీ) వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. వరుస ఎన్నికల నేపథ్యంలోఅధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పొలిటికల్ అగ్గికి మరింత ఆజ్యంపోస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబుపై తీవ్రవిమర్శలకు దిగారు.
దాడులు, దౌర్జన్యాలతో అధికార వైసీపీ అందరినీ బెదరగొడుతోందని, స్థానిక ఎన్నికల్లో సీఎం జగన్ కు గట్టిగా బుద్ధిచెప్పడానికి టీడీపీ శ్రేణులు రెడీగా ఉండాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. అసలు స్థానిక ఎన్నికలు రెండేళ్లపాటు వాయిదా పడటానికి చంద్రబాబే కారకుడని, ప్రస్తుతం జనాన్ని ఓట్లు అడగటానికి టీడీపీ దగ్గర ఒక్క అంశం కూడా లేదన్నారు.'స్థానిక ఎన్నికల్లో ఏమని ఓట్లు అడుగుతావు బాబూ? 'ఇన్ సైడర్' ట్రేడింగ్ తో కొట్టేసిన భూములకు ధరలు పడిపోకుండా చూడాలని ప్రజల్ని ప్రాధేయపడతావా?''అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పేదలకు ఇళ్ల పట్టాలు, మద్య నియంత్రణపైనా టీడీపీ స్టాండ్ విచిత్రంగా ఉందని విజయసాయి మండిపడ్డారు. ప్రస్తుతం ప్రజలు ఎలాగోలా బతుకీడుస్తున్నారు కాబట్టి.. వాళ్లనలా ఇళ్ల పట్టాలు లేకుండానే బతికేయమన్నట్లు బాబు మాట్లాడుతున్నారని, మద్యం మహమ్మారి వల్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయన్న ధ్యాస కూడా లేకుండా పైపెచ్చు ధరలు తగ్గించాలంటూ డిమాండ్ చేయడం చంద్రబాబు ఒక్కరికే సాధ్యమని ఫైరయ్యారు.
రెండేళ్ల కిందటే జరగాల్సిన స్థానిక ఎన్నికలకు అనేక అడ్డంకులు సృస్టిస్తూ వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు కూడా అదే పంథా అనుసరిస్తున్నారని, ఎన్నికల్లో మద్యం, డబ్బుల పంపకాన్ని నిరోధిస్తూ ప్రభుత్వం రూపొందించిన నిబంధనలపై వింతవాదనలు చేస్తున్నారని వైసీపీ ఎంపీ అన్నారు. ''చంద్రబాబూ.. మద్యం, డబ్బు పంపిణీ లేకపోతే టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయబోదని ఇప్పటికే చేతులెత్తేశారు. ఇంకా దివాళాకోరు రాజకీయాలెందుకు? ఇక నీ వల్ల కాదుగానీ నీ కుల మేధావి కిరసనాయిలు సలహా ప్రకారం నడుచుకో'' అంటూ పరోక్షంగా ఓ పత్రికాధిపతిని ఉద్దేశంచి విజయసాయి విమర్శించారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఇలా..
ఏపీలో మూడంచెల స్థానిక ఎన్నికలకు వరుసగా ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 21న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం సోమవారం నుంచి బుధవారం దాకా నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 23న జరిగే మున్సిపల్ ఎన్నికలకు ఈనెల 11 నుంచి 13 వరకు నామినేషన్లు ఉంటాయి. ఈనెల 27న జరిగే తొలిదశ పంచాయితీ ఎన్నికలకు 17 నుంచి 19 వరకు నామినేషన్లు, 29న జరిగే రెండో దశ పంచాయితీ ఎన్నికలకు 19 నుంచి 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇక ఫలితాల విషయానికొస్తే.. 24న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, 27న మున్సిపల్, 27,29 తేదీల్లో పంచాయితీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.