కోనసీమ అలర్ల వెనుక జగన్ దావోస్ టూర్ ? వైసీపీ ఎంపీ షాకింగ్ ట్వీట్స్
ఏపీలోని కోనసీమ జిల్లాల్లో తాజాగా చెలరేగిన హింసలో ఓ మంత్రి, మరో ఎమ్మెల్యేకు చెందిన మూడు ఇళ్లు, కార్లు, ఫర్నిచర్, ఇతర ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీని వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిన్నటి హింపై ఏడు కేసులు నమోదు చేసి కారకుల్ని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి చెందిన ఎంపీ కోనసీమ అల్లర్లకు జగన్ దావోస్ టూర్ కూ లింక్ పెడుతూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

కోనసీమలో అల్లర్లు
గోదావరి డెల్టా ప్రాంతమైన కోనసీమ జిల్లా పేరు మార్పుపై నిన్న అమలాపురంలో చోటు చేసుకున్న హింస రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దీనిపై పోలీసుల దర్యాప్తు పూర్తికాకముందే రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే ఈ హింస వెనుక ఎవరుున్నారనే దానిపై ఎవరూ సరైన కారణాలు చెప్పలేని పరిస్ధితి. ఎవరి వద్దా నిర్దిష్టమైన ఆధారాలు కూడా లేవు. దీంతో ఎవరికి వారు తమదైన విశ్లేషణలు చేసేస్తున్నారు. పోలీసుల విచారణ పూర్తయితే కానీ అసలు కారణాలు బయటికి వచ్చేలా కనిపించడం లేదు.

వైసీపీ ఎంపీ షాకింగ్ ట్వీట్స్
కోనసీమలో నిన్న చోటు చేసుకున్న అల్లర్లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ షాకింగ్ ట్వీట్స్ చేశారు. ఇందులో ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీతో పాటు ఇతర పార్టీల్లో సైతం చర్చనీయాంశమవుతున్నాయి. ఎప్పుడూ చంద్రబాబును టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెట్టే సాయిరెడ్డి.. ఈసారి కూడా చంద్రబాబును లింక్ చేస్తూనే జగన్ దావోస్ టూర్ ను కూడా ఇందులో కలుపుతూ చేసిన ట్వీట్లపై కలకలం రేగుతోంది. అయితే దీనిపై వైసీపీ నేతలెవరూ స్పందించడం లేదు.

కోనసీమ అల్లర్ల వెనుక జగన్ దావోస్ టూర్ ?
ప్రస్తుతం సీఎం జగన్ దావోస్ లో పర్యటిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన పెట్టుబడుల ఆకర్షణలో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో చోటు చేసుకున్న కోనసీమ అల్లర్లపై సాయిరెడ్డి తన ట్వీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకే కోనసీమలో అల్లర్లు రేపారని సాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దావోస్ సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రావొద్దని చంద్రబాబు గ్యాంగ్ కోనసీమలో విధ్వంసకాండకు పాల్పడిందని సాయిరెడ్డి ఆరోపించారు. శాంతి భద్రతల పరిస్దితి బాగోలేదనే కళంకం తెచ్చేందుకే ఈ దారుణానికి ఒడిగట్టారని విమర్శించారు. మహనీయుడు అంబేద్కర్ ను అవమానిస్తే జాతి క్షమించదని, రాజకీయంగా పుట్టగతుల్లేకుండా పోతారని శాపనార్దాలు పెట్టారు.

చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు
మంటలు రాజేసి ప్రజాభిమానం పొందాలని చూడటం వృథా ప్రయాస బాబూ అంటూ మరో ట్వీట్ లో విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. నిప్పుతో చెలగాటం ఆడటం అస్సలు మంచిది కాదని సలహా ఇచ్చారు. ఇలాంటి కుట్రలకు పాల్పడిన వారంతా చరిత్ర హీనులుగా మిగిలిపోయారని సాయిరెడ్డి గుర్తుచేశారు. దేవుళ్ల విధ్వంసం నుంచి నీ అరాచకాలను జనం మర్చిపోలేదని చంద్రబాబును విమర్శించారు. రెచ్చగొట్టి సాధించేదేమీ ఉండదు, కేసుల్లో ఇరికించడం తప్ప అంటూ సాయిరెడ్డి తన ట్వీట్ ముగించారు.












Click it and Unblock the Notifications