సీఎంగా రేవంత్ ఎంపిక తరువాత.. వైసీపీ ఫస్ట్ రియాక్షన్
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సాయంత్రానికి ఆయన హైదరాబాద్కు చేరుకుంటారు. గురువారం మధ్యాహ్నం 1:04 నిమిషాలకు లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రొనాల్డ్ రాస్.. ఇతర అధికారులు ఈ ఉదయం ఎల్బీ స్టేడియాన్ని సందర్శించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు.

రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్లు తరలి రానున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు.
కాగా- రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతోండటం పట్ల ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైన తరువాత వైఎస్ఆర్సీపీ తన అభిప్రాయాన్ని తెలియజేయడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రేవంత్కు అభినందనలు తెలియజేసింది వైసీపీ. ఈ మేరకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ను పోస్ట్ చేశారు. తన తోటి ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపికయ్యారని వ్యాఖ్యానించారు. ఆయనకు విషెస్ తెలిపారు. జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి హోదా వరకు రేవంత్ రెడ్డి సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకమని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications