చంద్రబాబు ఏపీకి రావడానికి కారణం చెప్పిన వైసీపీ ఎంపీ: అక్కడ నో సేఫ్: అదే ప్రజాసేవ: సెటైర్లు
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అరెస్టు భయం పట్టుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఆ భయంతోనే ఆయన హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో రోజువారీ విచారణ ప్రారంభించిన నేపథ్యంలో.. తెలంగాణ ఉంటే సేఫ్ కాదనే ఉద్దేశంతోనే చంద్రబాబు స్వరాష్ట్రానికి వచ్చారని ధ్వజమెత్తారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందట ఆయన ఓ ట్వీట్ చేశారు. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం ఓటుకు నోటు కేసును తిరగదోడుతోందని సాయిరెడ్డి అన్నారు.
విశాఖ తీరంలో కలకలం: కొట్టుకొచ్చిన భారీ షిప్: అందులో?: ఈదురు గాలులు, బలమైన అలల ధాటికి
తెలంగాణలోని అవినీతి నిరోధక విభాగం ప్రత్యేక న్యాయస్థానం ఓటుకు నోటు కేసులో రోజువారీ విచారణ చేపట్టిందని చెప్పారు. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ చంద్రబాబుదేనంటూ ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిర్ధారించిందని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా పక్కాగా సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. రోజువారీ విచారణ సందర్భంగా హైదరాబాద్లో ఉంటే భద్రత లేదనే కారణంతోనే చంద్రబాబు కరకట్టకు పారిపోయి వచ్చారని ప్రజలు గుసగుసలాడుతున్నారని సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
'వెయ్యి గొడ్లను పీక్కుతిన్న రాబందు ఒక్క గాలి వానకు కుప్పకూలిందనే సామెత చంద్రబాబు లాంటి వారి కోసమే పుట్టి ఉంటుందని సాయిరెడ్డి చురకలు అంటించారు. ఓటుకు కేసు నుంచి చంద్రబాబు తప్పించుకోలేకపోవచ్చని సాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇన్నిరోజులూ హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు హుటాహుటిన ఉండవల్లిలోని తన కరకట్ట నివాసానికి రావడానికి ఓటుకు నోటు కేసు విచారణే కారణమని అన్నారు.
అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి శోకాలు తప్ప ప్రజల కోసం చంద్రబాబు ఏనాడైనా నోరు విప్పారా? అని విజయసాయి రెడ్డి నిలదీశారు. ఎప్పుడో ఒకసారి సందర్శకుల్లా రావడం, అమరాతి ప్రాంత రైతులను రెచ్చగొట్టేలా ప్రసంగించడం మినహా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ సాధించింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. అలా రెచ్చగొట్టేలా ప్రసంగాలు ఇవ్వడమే ప్రజాసేవగా భావిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా వారు జీతభత్యాలు తీసుకుంటున్నారని, కనీసం అందుకైనా రాష్ట్రానికి పనికి వచ్చే సలహాలు ఇవ్వాలని సూచించారు.