అమరావతికి బెంగళూరు వరదలతో లింక్ ! సాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్..
ఏపీలో అమరావతి రైతులు రాజధాని కొనసాగింపు కోరుతూ అరసవిల్లికి పాదయాత్ర చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం మరోసారి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుతోంది. ఈ తరుణంలో ఈ రెండు అంశాలకు మద్దతుగా, వ్యతిరేకంగా మాటలదాడి కూడా పెరుగుతోంది. ఇదే క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఓ ట్వీట్ చేశారు.
మరోవైపు తాజాగా కర్నాటక రాజధాని బెంగళూరును వరదలు ముంచెత్తాయి. దీంతో తూర్పు బెంగళూరులో పలు ప్రాంతాలు నీటమునిగాయి. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడిప్పుడే నగరం వరదల నుంచి తేరుకుంటోంది. అదే సమయంలో బెంగళూరు వరదలకు గల కారణాలపై దేశవ్యాప్తంగా చర్చ కూడా జరుగుతోంది. ఇలాంటి తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెంగళూరులో వరదలకు గల కారణాన్ని ట్వీట్ చేసారు. అంతేకాదు అమరావతి రాజధానిని దీనికి లింక్ చేశారు.

రాష్ట్రంలోని ఒక్క నగరంపైనే దృష్టిసారించి అభివృద్ధి చేస్తే ఎలాంటి ప్రతికూల ఫలితాలు తలెత్తుతాయో బెంగళూరు వరదలు నిరూపించాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కానీ ఏపీలో మూడు రాజధానుల మోడల్ ద్వారా అభివృద్ది వికేంద్రీకరణ జరిగి నగరాలు అభివృద్ధి చెందుతాయని, తద్వారా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని సాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు. తద్వారా అమరావతిలోనే రాజధాని పెట్టి అక్కడ ఒక్కటే అభివృద్ధి చేస్తే మిగతా నగరాలు అభివృద్ధి చెందే అవకాశం లేదనే అంశాన్ని సాయిరెడ్డి పరోక్షంగా ప్రస్తావించినట్లయింది.












Click it and Unblock the Notifications