రాజ్యసభలో చిదంబరంను టార్గెట్ చేసిన విజయసాయి రెడ్డి.. బడ్జెట్ విమర్శలపై చురకలు..
జీవిత భీమా సంస్థ ఎల్ఐసీలో ప్రభుత్వ వాటాలను విక్రయించాలన్న కేంద్రం ప్రతిపాదనను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తప్పు పట్టారు. నిధుల సమీకరణకు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం చారిత్రక తప్పిదానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. బడ్జెట్కు మద్దతు పలుకుతూనే కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు,విధానాలతో విజయసాయి విభేదించారు. అదే సమయంలో బడ్జెట్పై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చేస్తున్న విమర్శలను కూడా తిప్పికొట్టారు.వార్షిక బడ్జెట్పై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

ఎల్ఐసీలో వాటాల విక్రయంపై అభ్యంతరం..
దశాబ్దాలుగా దేశ ప్రజల విశ్వసాన్ని,ఆదరణను చూరగొన్న ఎల్ఐసీలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ సరైన నిర్ణయం కాదని విజయసాయి అన్నారు. నిధుల సమీకరణకు పన్నుల మార్గాన్ని ఎంచుకోకుండా.. పెట్టుబడుల ఉపసంహరణ వంటి నిర్ణయాలు తీసుకోవడాన్ని తప్పు పట్టారు. ప్రస్తుతం రూ.65వేల కోట్లుగా నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యాన్ని,పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2లక్షల 10వేల కోట్లకు పెంచుకోవడం జరిగిందని గుర్తుచేశారు. అంటే,గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

కార్పోరేట్ ట్యాక్స్ మినహాయింపుతో ఒరిగిందేమీ లేదని..
పన్నుల వసూళ్ళ ద్వారా రూ.1లక్షా 50 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్దేశించుకుందని విజయసాయి గుర్తుచేశారు. కానీ ఆ లక్ష్య సాధనలో ప్రభుత్వం దారుణంగా వైఫల్యం చెందిందన్నారు. కార్పోరేట్ ట్యాక్స్ మినహాయింపులను కూడా ఆయన తప్పు పట్టారు. ఆ కారణంగా ప్రభుత్వ ఖజానాపై రూ.1లక్షా 50 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడిందన్నారు. పోనీ దానివల్ల ఒరిగిన ప్రయోజనం కూడా ఏమీ లేదన్నారు. మార్కెట్లోకి కొత్తగా పెట్టుబడులు కూడా రాలేదన్నారు.
Recommended Video

చిదంబరంను టార్గెట్ చేసిన విజయసాయి..
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను చిదంబరం ఐసీయూలో ఉన్న పేషెంట్తో పోల్చడంపై విజయసాయి మండిపడ్డారు. చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నప్పటి కంటే.. ఇప్పుడు పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇందుకోసం గణాంకాలను కూడా సభలో వివరించారు. చిదంబరం హయాంలో ద్రవ్యలోటు 5.2 శాతం ఉంటే ప్రస్తుతం 3.8 శాతం ఉన్నారు. అలాగే ఆదాయ లోటు 3.9 శాతం ఉంటే ప్రస్తుతం అది 2.4 శాతం ఉందన్నారు. అప్పట్లో సబ్సిడీల విలువ మొత్తం రూ.1కోటి 90లక్షలు ఉండగా.. ప్రస్తుతం దాని విలువ రూ.2లక్షల 62వేల కోట్లకు చేరిందన్నారు.

చిదంబరంకు విజయసాయి చురకలు..
చిదంబరం హయాంలో విదేశీ మారక విలువలు 292 బిలియన్ డాలర్లు ఉండగా..ప్రస్తుతం 450 బిలియన్ డాలర్లకు చేరుకుందని గుర్తుచేశారు. గతంలో విదేశీ పెట్టుబడుల వృద్ది రేటు కేవలం 5శాతం కాగా.. ప్రస్తుతం అది 16శాతానికి చేరుకుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉపాధి హామీ పథకానికి కేవలం రూ33వేల కోట్ల నిధులను కేటాయిస్తే.. ప్రస్తుతం రూ.66వేల కోట్ల నిధులను కేటాయించారని అన్నారు. అప్పట్లో ద్రవ్యోల్బణం 10.5శాతం ఉండగా ఇప్పుడది 4.5శాతంగా ఉందన్నారు. అంతేకాదు,ఆర్థిక మందగమనం ఉన్నమాట నిజమేనని.. మందులతో చికిత్స అవసరమేనని,అయితే స్వస్థత కలుగుతుందన్న నమ్మకం కూడా పేషెంట్ను కోలుకునేలా చేస్తుందని చిదంబరంకు విజయసాయి చురకలంటించారు.

ఏపీని విస్మరించడంపై అసంతృప్తి
తాజా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ను విస్మరించడంపై విజయసాయి అసంతృప్తి వ్యక్తం చేశారు. జీఎస్టీ నిధుల విడుదలలో జాప్యం,పోలవరం ప్రాజెక్టుకు నిధులను కేటాయించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. 2019 నవంబర్-డిసెంబర్ జీఎస్టీ నిధులను ఇప్పటివరకు విడుదలచేయలేదని గుర్తుచేశారు. ఇకనైనా జీఎస్టీ నిధులను త్వరితగతిన మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,548కోట్లకు పెంచిన డీపీఆర్ను కేంద్రానికి సమర్పించి నెలలు గడుస్తున్నా... ఇప్పటివరకు ఎటువంటి స్పందనా లేదన్నారు.












Click it and Unblock the Notifications