విశాఖ రాజధానిపై సాయిరెడ్డి అనూహ్యం -కోర్టుతో సంబంధంలేదు, జగన్ ఎక్కడైనా ఉండొచ్చు -కానీ తేదీ అడగొద్దు
చాలా కాలంగా నిలిచిపోయిన ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వివాదం సంబంధిత కేసులు త్వరలోనే మళ్లీ విచారణకు రానుండగా, అధికార వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. కోర్టులతో సంబంధం లేకుండానే విశాఖలో రాజధాని ఏర్పాటవుతుందని, ముఖ్యమంత్రి ఎక్కడినుంచైనా పాలించొచ్చని అన్నారు. బుధవారం విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, రాజధానిపై వివరణ ఇచ్చారు. తరలింపు తేదీపైనా ఆసక్తికర కామెంట్ చేశారు..
విశాఖలో కీలక సమీక్షలు..
విశాఖపట్నం జిల్లాలో కోవిడ్ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలపై బుధవారం కలెక్టరేట్ లో లో జరిగిన సమీక్షా సమావేశాంలో ఎంపీ సాయిరెడ్డి పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, మంత్రి అవంతి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులూ ఈ భేటీకి హాజరయ్యారు. అలాగే, విశాఖపట్నం జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, సీఎం జగన్ ఇటీవల శంకుస్థాపన చేసిన విశాఖ అభివృద్ధి ప్రాజెక్టులపైనా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, మేయర్, స్థానిక మంత్రులతో ఎంపీ రివ్యూ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...
కోర్టులతో సంబంధం లేదు..
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని విశాఖపట్నానికి త్వరలోనే తప్పకుండా వస్తుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మూడు రాజధానుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందన్న ఆయన.. సీఆర్డీఏ చట్టంపై కోర్టులో ఉన్న కేసుతో రాజధాని తరలింపునకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పరిపాలన సాగించవచ్చన్నారు. అయితే..
రాజధాని తరలింపు తేదీని అడగొద్దు
విశాఖకు కార్యనిర్వాహఖ రాజధాని తప్పకుండా వస్తుందన్న విజయసాయిరెడ్డి ఆ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. రాజధాని తరలింపు తేదీని మాత్రం అడగొద్దన్నారాయన. ఇప్పటికే రాజధాని తరలింపు తేదీలు పలుమార్లు వాయిదా పడటం, ప్రతి సారీ ఫలానా పండక్కి సీఎం జగన్ విశాఖ నుంచే పని మొదలుపెడతారని మంత్రులు సైతం ప్రెస్ మీట్ల పెడుతోన్న నేపథ్యంలో ఇకపై రాజధాని తేదీల వెల్లడి ఉండబోదని ఎంపీ క్లారిటీ ఇచ్చారు. కాగా,
కొత్త రాజధానిలో అభివృద్ది జోరు..
ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా కానున్న విశాఖలో కైలాసగిరి నుంచి భోగాపురం వరకు 6 లైన్ల రోడ్ వేస్తామని, ముడుసర్లోవ పార్కుని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎంపీ సాయిరెడ్డి చెప్పారు. పంచ గ్రామాల సమస్యపై కోర్టుకు అఫిడవిట్ ఇచ్చామని, కోర్టు అనుమతి మేరకు ఇళ్ల యజమానులకు పట్టాలిస్తామని, సింహాచలం భూముల చుట్టూ ప్రహారీ గోడ నిర్మిస్తామన్నారు. అలాగే, ఏలేరు-తాండవ రిజర్వాయర్ అనుసంధానానికి రూ.500 కోట్లు మంజూరు చేయనున్నామని, విశాఖలో ప్రతి వార్డును అభివృద్ధి చేస్తామని ఎంపీ తెలిపారు. మరోవైపు..
టీడీపీ -బీజేపీ మధ్యలో సాయిరెడ్డి
ఏపీ ప్రతిపక్షమైన టీడీపీ, ఆ పొజిషన్ కోసం పాకులాడుతోన్న బీజేపీల మధ్య జరిగే వివాదాల్లో వేళ్లు పెట్టి పలుమార్లు చేయి కాల్చుకున్న తర్వాత కూడా విజయసాయిరెడ్డి తిరిగి అదే పని చేస్తుండటం గమనార్హం. తాజాగా మహానాడు వేదికగా కేంద్రంలోని బీజేపీకి సహకరించాలని చంద్రబాబు తీర్మానించడం, దాన్ని బీజేపీ నేతలు సైతం తప్పుపట్టిన తర్వాత కూడా సాయిరెడ్డి జోక్యం చేసుకుంటూ.. బీజేపీతో కలిసి పనిచేయాలన్న బాబు ఆలోచనను కమలం నేతలే తూర్పారా పట్టారని కామెంట్లుచేశారు. ''బాబు జూమ్ మహానాడు ఊసుపోక అందరితో తిట్టించుకునేందుకు పెట్టినట్టే ఉంది. తను చక్రం తిప్పినన్ని రోజులు పట్టించుకోకుండా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఇప్పుడు తీర్మానం చేయడం ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. రంగు వెలిసిన పార్టీలో ఉత్తేజం నింపాలంటే కార్యకర్తలకు స్పూర్తిదాయకమైన కార్యాచరణను ఇవ్వాలి. ప్రజలతో మమేకమై వారి అభిమానం చూరగొనాలని చెప్పాలి. బాబు మాత్రం ఏ కులాన్ని ఎలా మేనేజ్ చేయాలి. విద్వేషాలు రెచ్చగొట్టి సామరస్యాన్ని ఎలా దెబ్బతీయాలనే కాలం చెల్లిన వ్యూహాలకే పదును పెడుతున్నాడు'' అని సాయిరెడ్డి పేర్కొన్నారు.