చిన వాల్తేరులో చిన్న మెదడుకు చికిత్స: చంద్రబాబు, అయ్యన్నపై సాయిరెడ్డి సెటైర్లు
అమరావతి: అధికార వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులపై మరోసారి విరుచుకుపడ్డారు. సెటైర్లు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న పథకాలు, పీఆర్సీ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జోక్యం చేసుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల వల్ల టీడీపీ నాయకులకు తమ భవిష్యత్ ఏంటో స్పష్టమైందని, ఇక ఎప్పుడూ గెలవలేమనే నిర్ధారణకు వచ్చారని విమర్శించారు.
సంక్షేమ ప్రభుత్వ పాలనను పక్కదారి పట్టించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. దీనిపై ఆయన ఇవ్వాళ ట్వీట్లు చేశారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు ఛీకొట్టారని ఇక ఎప్పుడూ అధికారంలోకి రాలేరని అన్నారు. ప్రతి ఒక్కరికీ అందేలా, సంతృప్తికర స్థాయిలో రాష్ట్రంలో జగన్ సర్కార్ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని విజయసాయి రెడ్డి చెప్పారు. ఏ ప్రభుత్వంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారు.
ఎన్నికల్లో గెలవలేమనే అక్కసులో తెలుగుదేశం పార్టీ నాయకులు మునిగిపోయారని విమర్శించారు. తాము అధికారంలోకి రాలేమని వారికి తెలిసిపోయిందని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. అందుకోసమే ఎల్లో మీడియా, అద్దె మైకులతో అందరినీ తిట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలా శాడిస్టిక్ ఆనందాన్ని పొందుతున్నారంటూ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ఎల్లో మీడియా యజమానులు ప్రతి విషయంలోనూ చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ అనేది- ఎప్పుడు పగులుతుందో తెలియని నీటి బుడగలా మారిందని ఆయన చురకలు అంటించారు. ఈ నీటి బుడగను చూసి వారు మురిసి పోతున్నారని ఎద్దేవా చేశారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపైనా విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలను సంధించారు. ఆయనను ఆత్రం పాత్రుడిగా అభివర్ణించారు. మైండ్ రీబోర్కు వచ్చిందంటూ సెటైర్లు సంధించారు.
అయ్యన్నపాత్రుడి జీవితం చరమాంకంలోకి వచ్చిందని, 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత తన భవిష్యత్తేమిటో తేటతెల్లం కావడంతో మైండ్ రీబోర్కు వచ్చిందని విజయసాయి రెడ్డి విమర్శించారు. ఆయన పిచ్చి పీక్స్కు చేరిందని, అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని అన్నారు. ఆయన్నపాత్రుడి చిన్నమెదడును చిన్నవాల్తేర్లో చికిత్స చేయాల్సిన తరుణం ఆసన్నమైందని విజయసాయి రెడ్డి విమర్శనాస్త్రాలను గుప్పించారు.