బహుళ రాజధానులు కొత్తేం కాదు-సాయిరెడ్డి ఇంగ్లీష్ ట్వీట్-మా ప్లాన్ తో టీడీపీ మైండ్ బ్లాక్..
ఏపీలో ఎక్కడ చూసినా ఇప్పుడు రాజధానుల చర్చ నడుస్తోంది. అమరావతికి మద్దతుగా విపక్షాలు, మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ కత్తులు నూరుతున్నాయి. అమరావతి రైతులు పాదయాత్ర చేపడితే, దానికి కౌంటర్ గా ప్రభుత్వం అసెంబ్లీలో మూడు రాజధానుల చర్చ చేపట్టింది. రేపోమాపో బిల్లు కూడా ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ బహుళ రాజధానులకు మద్దతుగా ట్వీట్ చేశారు.
భారత్ లో బహుళ రాజధానులు కొత్తేమీ కాదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో ముంబై, నాగపూర్ రూపంలో రెండు రాజధానులు ఉన్నాయని, జమ్ముకశ్మీర్ లో శ్రీనగర్, జమ్మూ రూపంలో రెండు రాజధానులున్నాయని, మధ్యప్రదేశ్ లో భోపాల్ లో రాజధాని, జబల్పూర్ లో హైకోర్టు ఉందని సాయిరెడ్డి పేర్కొన్నారు. అలాగే ఛత్తీస్ ఘడ్ లో రాజధాని రాయ్ పూర్ లోనూ, హైకోర్టు బిలాస్ పూర్ లో ఉందన్నారు. యూపీలోనూ లక్నోలో రాజధాని, అలహాబాద్ లో హైకోర్టు ఉందన్నారు. కేరళలోనూ త్రివేండ్రంలో రాజధాని, ఎర్నాకుళంలో హైకోర్టు ఉందన్నారు.
మరో ట్వీట్ లో జగన్ ముందుచూపును వ్యతిరేకించడంలో విపక్ష టీడీపీకి ఆలోచనలే కరువయ్యాయని సాయిరెడ్డి పేర్కొన్నారు. అందుకే ఆ పార్టీ ఏపీ మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే తమ ప్రాంతాల అభివృద్ధి కోరుకుంటున్న కర్నూలు, విశాఖ ప్రజల ఆగ్రహాన్ని మూటగట్టుకుంటోందన్నారు.
తద్వారా విశాఖ, కర్నూల్లో ప్రజల ఆకాంక్ష అయిన రాజధానుల్ని టీడీపీ వ్యతిరేకిస్తున్నట్లు సాయిరెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో నిన్న సీఎం జగన్ రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సాయిరెడ్డి కూడా దానికి మద్దతుగా ట్వీట్ పెట్టారు.