VijayaSai Reddy : సాయిరెడ్డిని మళ్లీ వరించిన పదవి-ఉపరాష్ట్రపతి ప్రకటన- ఇదే ఫైనల్ !
ఏపీలో వైసీపీ వ్యవహారాల్లో కీలకంగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డికి గతంలో జాతీయ స్ధాయిలో ఓ కీలకమైన పదవి దక్కింది. అది దక్కిందని సంబరపడే లోపే మళ్లీ పోయినట్లయింది. తిరిగి ఇవాళ మరోసారి ఆ పదవికి విజయసాయిరెడ్డి ఎంపికైనట్లు ప్రకటన వెలువడింది. అయితే మధ్యలో ఏం జరిగిందనే చర్చ కూడా జరిగింది. ఏదైతేనేం ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇకపై దేశం దృష్టిని ఆకర్షించే ఆ కీలక పదవిలో మాత్రం కొనసాగబోతున్నట్లు స్వయంగా ఉపరాష్ట్రపతే ప్రకటించారు.

విజయసాయిరెడ్డికి పదవి
వైసీపీ కీలక ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పెద్దలతోనూ, ప్రధాని మోడీ, అమిత్ షా వంటి వారితోనూ సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో రాజ్యసభలో ఇప్పటికే పలు పార్లమెంటరీ కమిటీలకు ఆయన నేతృత్వం వహించడం లేదా అందులో సభ్యుడిగా ఉండటం కూడా జరుగుతోంది. అంతే కాదు సాయిరెడ్డి ఆధ్వర్యంలోని పార్లమెంటరీ కమిటీలు కూడా మంచి పనితీరు కనబర్చి ప్రశంసలు అందుకున్న సందర్భాలూ లేకపోలేదు. దీంతో ఈసారి విజయసాయిరెడ్డికి మరింత పెద్ద పదవి ఇచ్చేందుకు ఎన్డీయే సర్కార్ ముందుకొచ్చింది. అయితే మధ్యలో దీనికి బ్రేక్ పడింది.

రాజ్యసభ వైస్ ఛైర్మన్ గా సాయిరెడ్డి ?
రాజ్యసభ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల గైర్హాజరీలో సభను నడిపించే బాధ్యతను ప్రత్యామ్నాయంగా నియమించే ప్యానెల్ చూసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో రాజ్యసభలో సీనియర్ ఎంపీలతో ఈ ప్యానెల్ ను నియమిస్తుంటారు. అధికార పక్షం తమకు అనుకూలంగా ఉండే ఎంపీలతో వైస్ ఛైర్మన్ ప్యానెల్ ను ఏర్పాటు చేస్తారు. ఇందులో ఉండే ఎంపీలంతా సహజంగానే కేంద్రానికి అనుకూలంగా ఉండే వారే ఉంటారు. ఈ ప్యానల్లో తాజాగా విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. దీంతో సాయిరెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని అందరితోనూ పంచుకున్నారు. అయితే అక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది.

రఘురామ ఫిర్యాదుతో బ్రేక్ ?
రాజ్యసభలో వైసీపీ ఎంపీ అయిన విజయసాయిరెడ్డిని వైస్ ఛైర్మన్ ప్యానల్లో చేర్చినట్లు తెలియగానే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు.. ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఇందులో ఆయన సాయిరెడ్డి ట్వీట్లలో పాడుతున్న భాషను, ఆయన గత రికార్డును ఛైర్మన్ కు ఇంగ్లీష్ లో తర్జుమా చేసి మరీ పంపినట్లు ఈ ప్రచారం సారాంశం. ఇందులో నిజమెంతో తెలియదు కానీ అకస్మాత్తుగా రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కడ్ సభలో సాయిరెడ్డి పేరు లేకుండానే మిగతా పేర్లను మాత్రం గతంలో ఓసారి చదివి వినిపించారు. ఇందులో సాయిరెడ్డి పేరు లేకపోయే సరికి ఆయన షాకయ్యారు. వెంటనే ట్విట్టర్ లో ట్వీట్ కూడా డిలీట్ చేశారు. అయితే దీని వెనుక ఉన్న కారణాలపై రఘురామ కూడా ట్వీట్లు పెట్టారు.
సాయిరెడ్డి పదవి కన్ఫమ్ ?
అయితే మధ్యలో ఏమైందో ఏమో తెలియదు కానీ మరోసారి రాజ్యసభలో వైస్ ఛైర్మన్ ప్యానల్లో ఉన్న సభ్యుల పేర్లు చదివిన ఛైర్మన్ జగ్ దీప్ ధన్కడ్ ఈసారి విజయసాయిరెడ్డి పేరు కూడా చదివారు. దీంతో సాయిరెడ్డి పేరు ఈ జాబితాలో ఉన్న విషయం నిర్ధారణ అయింది. అంతే కాదు సాయిరెడ్డి పేరు కన్ఫమ్ అయినట్లయింది. అదే సమయంలో సాయిరెడ్డితో పాటు తాజా ఎంపీ పీటీ ఉషకు సైతం ఈ ప్యానల్లో చోటు కల్పించారు. దీంతో సాయిరెడ్డితో పాటు పీటీ ఉష కూడా ఇకపై రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానల్లో ఉండి సభను నడిపించబోతున్నారన్న మాట.












Click it and Unblock the Notifications