చంద్రబాబుకు అచ్చెన్నాయుడి షాక్.. సిట్కు కీలక డైరీలు.. ఏం బతుకులు మీవి?: విజయసాయి ఫైర్
ఏపీలో భారీ ఈఎస్ఐ కుంభకోణం, దాంతోపాటు గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటిపై దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు వ్యవహారం కలకలం రేపుతున్నాయి. ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు.. సొంత పార్టీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చే ప్రయత్నం చేశారంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆదివారం సంచలన కామెంట్లు చేశారు. ఈఎస్ఐ స్కాం, సిట్ దర్యాప్తు తర్వాత టీడీపీలో జరుగుతోన్న పరిణామాల్ని ఆయన వివరించారు.

సిట్ చేతికి సీక్రెట్ డైరీలు..
ఈఎస్ఐ కుంభకోణం విషయంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ధీమాగా ఉన్నారని, దోచుకున్న డబ్బులో సగం చంద్రబాబు కొడుకు లోకేశ్ కు పంపాడు కాబట్టే.. అంతా చంద్రబాబు చూసుకుంటారన్న భరోసాతో అచ్చెన్న ధీమాగా ఉన్నాడని విజయసాయి రెడ్డి చెప్పారు. ‘‘ఒకవేళ పార్టీగానీ తనకు అండగా నిలవకపోతే.. సీక్రెట్ డైరీలను సిట్ చేతికి అప్పగిస్తానని అచ్చెన్న చంద్రబాబును బెదిరిస్తున్నారట. అందీగాక, లోకేశ్ చెబితేనే లేఖ రాశానని, అందరికీ తెలిసే కుంభకోణం జరిగిందికాబట్టి.. తనకొచ్చిన ఉపద్రవమేదీ లేదని అచ్చెన్న ధీమాగా ఉన్నారట''అని విజయసాయి రాసుకొచ్చారు.

ఆ జైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా?
మొన్న ఐటీ దాడులు, ఇవాళ ఈఎస్ఐ స్కాం, సిట్ ఏర్పాటుతో టీడీపీ చీఫ్ అక్రమాలు బయటపడటం ఖాయమని, చంద్రబాబు ఫ్యూచరంతా జైల్లోనే గడుపుతారని వైసీపీ ఎంపీ విమర్శించారు. ‘రంగస్థలం'సినిమా పాట ట్యూన్ లో.. సీఎం జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ గుర్తుకొచ్చేలా.. ‘‘ఆ జైలు కెళ్తావా చంద్రన్న? ఈ జైలు కెళ్తావా? ఆ పక్కనేమో వైజాగ్ సెంట్రల్, ఈ పక్కనేమో కడప కారాగారం. నడిమధ్యనున్నది రాజమండ్రి చెరసాల.. అసలే ఎండాకాలం.. రెండు ఏసీలేసుకుని పడుకునే వాడు. ఎలా తట్టుకుంటాడో ఏమో? ''అని విజయసాయి విమర్శించారు.

అడిగింది మీరేగా..
తమ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదని, అవసరమైతే ద్యాప్తుకు కూడా సిద్ధమని టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆ పార్టీ నేతలు గతంలో చేసిన సవాళ్లను గుర్తుచేస్తూ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘దమ్ముంటే దర్యాప్తు జరిపించుకోండి. అధికారంలో ఉన్నారు కదా అని నిన్న మొన్నటి వరకు సవాళ్లు విసిరిన వారంతా కుక్కిన పేనులయ్యారు. ఏ తప్పూ చేయలేదనుకుంటే సిట్ ముందుకు వచ్చి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి. పునీతులని తేలితే మిమ్మల్నెవరూ పల్లెత్తు మాట అనరు''అని ట్విటర్ లో రాసుకొచ్చారు.

మీదీ ఒక బతుకేనా?
విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటుకు ఇండియన్ నేవీ అభ్యంతరం చెప్పిందంటూ టీడీపీ, దాని అనుకూల మీడియా విషప్రచారం చేస్తున్నాయని, అందులో ఒక్కముక్కకూడా నిజం లేదని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ‘‘విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవీ నో చెప్పిందంటూ పచ్చపత్రికలు బోగస్ వార్తలు రాశాయి. వాటిని టీడీపీ నేతలు కూడా సమర్థించారు. సున్నిత రక్షణ సమాచారాన్ని బయటపెడ్డటంతోపాటు దాన్ని వివాదాస్పదం చేసిన మీడియాపై, టీడీపీ నేతలపై దేశద్రోహం కేసులు పెట్టాలి. ఏం బతుకులు మీవి? అమరావతి కోసం భారత నౌకాదళాన్ని కూడా వివాదంలోకి లాగుతారా?''అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications