టీడీపీది నవరంధ్రాల నవ రోదనలు.. జగన్ జోలికి వస్తే ఖబడ్ధార్ ! : వైసీపీ ఎంపీలు వార్నింగ్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీలు అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని వైసీపీ ఎంపీలు హెచ్చరించారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ ఉందన్నారు. ప్రజల ఆదరణ చూసి తెలుగుదేశం పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ప్రజల తలసరి ఆదాయం పెరిగిందన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే ఇదంతా సాధ్యమైందని స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.

టీడీపీ అడ్రస్ గల్లంతే..
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయమని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ జోస్యం చెప్పారు. సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత టీడీపీ ఎంపీలకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను చూసి విపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. ప్రజల వద్దకే సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. కేవలం లక్షా 75 వేల కోట్ల రూపాయలను సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. టీడీపీది నవరంధ్రాల నవ రోదనలు అని దుయ్యబట్టారు.

బెల్టుషాపులు తెచ్చిన చరిత్ర చంద్రబాబుది..
రాష్ట్రంలో ప్రతి గ్రామంలో బెల్టు షాపులు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని ఎంపీ భరత్ విమర్శించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధించాలంటే మూడు రాజధానులతోనే సాధ్యమని చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి అవసరం లేదా అని నిలదీశారు. జగన్ పాలనలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్పై ఇష్టాను సారం మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ప్రత్యేక హోదాతో తమతో కలిసి రాలేదు..
రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ ఎంపీలు తుంగలో తొక్కారని వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా తెలుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బుద్ధిరాలేదని విమర్శించారు. ఏపీలో చచ్చిన పార్టీని బతికించుకోడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమని చురకలు అంటించారు. ప్రత్యేక హోదా విషయంలో తమతో కలిసి రావాలని కోరినా రాలేదని దుయ్యబట్టారు. ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి.. హైదరాబాద్ నుంచి విజయవాడ పారిపోయారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులతో రాయలసీయతో పాటు ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications