భావోద్వేగంతో రాజీనామాలు, మళ్లీ ఆలోచించండి: వైసీపీ ఎంపీలకు స్పీకర్ సుమిత్ర
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మంగళవారం సాయంత్రం లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలిశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డిలు ఎంపీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. స్పీకర్ పిలుపు మేరకు వారు ఢిల్లీలో సుమిత్రను కలిశారు.
తమ రాజీనామాలు ఆమోదించాలని ఆమెకు వారు విజ్ఞప్తి చేశారు. రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజీనామాలు చేయడానికి గల కారణాలను ఆమె అడిగి తెలుసుకున్నారు.
రాజీనామాలు భావోద్వేగపూరితంగా ఉన్నాయి
వారితో చర్చించిన అనంతరం స్పీకర్ సుమిత్ర రాజీనామాలపై స్పందిస్తూ... భావోద్వేగపూరితంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లుగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వారు రాజీనామాలు చేసినట్లు అనిపిస్తోందన్నారు. వాటన్నింటినీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
వచ్చేనెల 5 నుంచి 7 వరకు తనను మరోసారి కలవాలని వారికి సూచించినట్లు చెప్పారు. అలాగే, రాజీనామాలపై వైసీపీ ఎంపీలు పునరాలోచించుకోవాలని, నిర్ణయం మారకపోతే రాజీనామాలు ఆమోదిస్తానని అన్నారు.
వైసీపీ సభ్యుల రాజీనామాలని కొందరు, కర్ణాటక ఎంపీల రాజీనామాల ఆమోదానికి ముడిపెట్టి మాట్లాడుతున్నారని, ఆ రాష్ట్ర పరిస్థితులు వేరు, ఈ పరిస్థితులు వేరని సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు.
కాగా, వైసీపీ లోకసభ సభ్యులు రాజీనామా చేసి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ, స్పీకర్ ఇప్పటికీ వాటిని ఆమోదించలేదని విమర్శలు వచ్చాయి. తమ పార్లమెంటు సభ్యత్వాలకు బీజేపీ కర్ణాటక నేతలు యడ్యూరప్ప, బీ శ్రీరాములు రాజీనామాలు చేయగా, వాటిని స్పీకర్ ఆమోదించారు. మరోవైపు వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించకపోవడంపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో సుమిత్రా మహాజన్ ఇలా వివరణ ఇచ్చారు.