ఆ నియోజకవర్గంలో పోటీకి నారా లోకేష్ను ఆహ్వానించిన వైసీపీ ఎంపీ
రాజమండ్రి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజమండ్రి లోక్సభ సభ్యుడు మార్గాని భరత్.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుప్పం పర్యటన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. కుప్పంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడటం వల్లే టీడీపీ నాయకులు ఉలిక్కిపడుతున్నారంటూ ఎదురుదాడికి దిగారు. ఈ సారి కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిచే పరిస్థితులు లేవని తేల్చి చెప్పారు.
Recommended Video
ఉత్తుత్తి సవాళ్లతో..
ఈ మధ్యాహ్నం ఆయన రాజమండ్రిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నారా లోకేష్ విసురుతున్న సవాళ్లను చూస్తోంటే ఉత్తర కుమారుడు గుర్తుకొస్తోన్నాడని ఎద్దేవా చేశారు. ఆయన చేసే సవాళ్లన్నీ ఉత్తిత్తివేననే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి కుప్పం నియోజకవర్గంలో ఏం పని అంటూ నారా లోకేష్ చెప్పడాన్ని బట్టి చూస్తోంటే ఆయనకు ఉన్న పరిజ్ఞానం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
మంత్రిగా పెద్దిరెడ్డి..
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారని మార్గాని భరత్ గుర్తు చేశారు. మంత్రిగా ఆయన రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే అధికారం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికైనా వెళ్ళే హక్కు ఆయనకు ఉందని చెప్పారు. నారా లోకేష్కు రాజకీయాల పట్ల కనీస అవగాహన లేదనేది దీనితో స్పష్టమౌతోందని చెప్పారు. బుర్ర లేకుండా మాట్లాడుతున్నారంటూ మార్గాని భరత్ చురకలు అంటించారు.
మూడు శాఖల మంత్రిగా..
కార్పొరేటర్గా, కనీసం కౌన్సిలర్గా కూడా గెలవలేని లోకేష్ దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యాడని, మంత్రిగా మూడు శాఖలు వెలగబెట్టాడని విమర్శించారు. మూడు శాఖల మంత్రిగా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలను కల్పించారని ప్రశ్నించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేస్తానంటూ తన అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారని మార్గాని భరత్ విమర్శించారు. లోకేష్కు దమ్ముంటే రాజమండ్రి నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు.
ఎంతమంది కలిసి వచ్చినా..
గతంలో ఏడాదికి ఒక్కసారి కుప్పానికి వెళ్లే చంద్రబాబు- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు నెలకు నాలుగైదు రోజులు అక్కడే మకాం వేస్తోన్నారని మార్గాని భరత్ అన్నారు. బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయంటూ ఎల్లో మీడియా ఊదర గొడుతోందని, ఎంతమంది కలిసి వచ్చినా వైఎస్ఆర్సీపీకి ఎదురు నిలవబోరని అన్నారు. ధర్మ పోరాట దీక్ష పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా తిట్టిన చంద్రబాబు ఇప్పుడు ఆయనతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు.
బీజేపీతో పొత్తు కోసం
అమిత్ షా తిరుపతి పర్యటనకు రాగా ఆయనపై రాళ్లు వేయించిన ఘనత చంద్రబాబుకు ఉందని, ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని పొత్తు కోసం బీజేపీ నాయకుల వెంట తిరుగుతున్నారని మార్గాని భరత్ నిలదీశారు. వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామిక రంగంలో దూసుకెళ్తోందని అన్నారు. గ్రాసిమ్ ఇండస్ట్రీ రాష్ట్రానికి వచ్చిందని, తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కాబోతోందని భరత్ చెప్పారు.