కోటంరెడ్డి ఆడియో వైరల్- ఈసారి టీడీపీ నుంచి పోటీ ? ట్యాపింగ్ బయటపెడితే ఐపీఎస్ లు అవుట్ !
ఏపీలో వైసీపీ అధిష్టానంతో అసంతృప్తిగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేడో రేపో పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ లోపు ఆయన కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో బయటికొచ్చింది.
ఏపీలో వైసీపీ తరఫున గెలిచిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ మధ్యే సీఎం జగన్ ను కలిసినా ప్రయోజనం లేదని భావిస్తున్న ఆయన.. పార్టీ వీడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆలోపే కోటంరెడ్డి తన అనుచరులతో మాట్లాడినట్లు భావిస్తున్న ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
కోటంరెడ్డి ఆడియో వైరల్
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం నానాటికీ ముదురుతోంది. ఇప్పటికే వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా కనిపిస్తున్న ఆయన.. పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిన్ని ఉదయం నుంచి రాత్రి వరకూ ఆఫీసులోనే పార్టీ కార్యకర్తలతో చర్చలు జరిపిన ఆయన.. తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు. ఈ లోపు ఇవాళ కోటంరెడ్డి తాజాగా మాట్లాడినట్లు భావిస్తున్న ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఫోన్ ట్యాపింగ్ తో పాటు పార్టీ మార్పుపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ బయటపెడితే ..
తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఈ మధ్య ఆరోపిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. తాజాగా వైరల్ అవుతున్న ఆడియోలో దానికి కొనసాగింపుగా మరిన్ని వ్యాఖ్యలు చేశారు. ఇందులో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, అన్ని ఆధారాలున్నాయని కోటంరెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్ ల ఉద్యోగాలు పోతాయని వైసీపీ ఎమ్మెల్యే వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఇప్పటికే తాను 12 సిమ్ లు మార్చినట్లు కోటంరెడ్డి చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ ?
అలాగే పార్టీ మార్పుకు సంబంధించి జరుగుతున్న ప్రచారంపైనా కార్యకర్తలతో మాట్లాడిన ఆడియోలో కోటంరెడ్డి స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తున్నట్లు వారికి కోటంరెడ్డి స్పష్టం చేశారు. అలాగే నెల్లూరు రూరల్ నుంచే పోటీ చేస్తానని కూడా తెలిపారు. దీంతో కోటంరెడ్డి పార్టీ మార్పు తప్పదని తేలిపోయింది. అయితే ఎప్పుడు, ఎలా అన్న దానిపైనే చర్చ నెలకొంది. మరోవైపు కోటంరెడ్డి పార్టీ మారకుండా చూసేందుకు జగన్ తరఫు దూతలు ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ.. ఈ ఆడియో చిచ్చు రేపుతోంది.