జగన్ వ్యూహాలకు రఘురాముడు చిత్తు- హస్తినలో ముచ్చెమటలు - చేసేది లేక దారికి...
కొంతకాలంగా వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలపై కత్తులు దూస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎట్టకేలకు శాంతించక తప్పలేదు. నిన్న మొన్నటి వరకూ వైసీపీ నేతల నుంచి తనను రక్షించేందుకు కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని డిమాండ్లు చేసిన రఘురామకృష్ణంరాజుకు అది ఎంత వరకూ సాధ్యమో ఢిల్లీ వెళ్లాక అర్ధమైంది. కేంద్రంతో చర్చలంటూ హంగామా చేసి ఢిల్లీకి వెళ్లిన రఘురామకృష్ణంరాజును పలకరించే వారే కరువయ్యారు. చివరికి అందుబాటులో ఉన్న కొందరిని కలిసి వెనక్కి రాక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన జగన్ పై దాడిని ఎంపీ విజయసాయిరెడ్డిపైకి మళ్లించేందుకు ప్రయత్నించారు.
రఘురాముడికి ఢిల్లీలో షాక్...
ఏడాది క్రితం వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీలో తనకు గౌరవం దక్కలేదన్న కారణంగా రెబెల్ అయ్యేందుకు ప్రయత్నించి, బహిష్కరిస్తే బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు జగన్ అంటే ఏమిటో తెలియడానికి 24 గంటలు కూడా పట్టలేదు. ఢిల్లీకి వెళ్లే ముందు వైసీపీ నేతల నుంచి తనను రక్షించేందుకు కేంద్ర బలగాలు కావాలని డిమా్ండ్ చేసిన రఘురామకృష్ణంరాజు... అక్కడి నుంచి వెనుదిరిగే సమయానికి పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇస్తానని చెప్పడాన్ని బట్టి చూస్తే హస్తినలో ఆయనకు ఏ రేంజ్ లో చుక్కలు కనిపించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పూర్తిగా యూటర్న్ తీసుకున్న రఘురామ...
ఢిల్లీ పర్యటనలో మొత్తం కేంద్రాన్నే కదిలిస్తాననేలా ప్రచారం చేసుకున్న రఘురామకృష్ణంరాజుకు అక్కడికి వెళ్లే సరికి కొన్ని గంటల్లోనే పూర్తిగా తత్వం బోధపడింది. దీంతో ఆయన పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. గతంలో బొచ్చులో నాయకత్వం అంటూ ఏకంగా జగన్ పైనే తీవ్ర వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణంరాజు... ఈసారి సీఎం మీద ఉన్న గౌరవంతో షోకాజ్ నోటీసుకు సమాధానం ఇస్తానని చెప్పుకున్నారంటే పరిస్దితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇన్నాళ్లూ తాను చేసిన దాడిని సమర్ధించుకునే ప్రయత్నంలో ఆయన పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిని తెరపైకి తెచ్చారు.
జగన్ కు తెలియకుండానే సాయిరెడ్డి నోటీసులు...
పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇస్తూ అసలు పార్టీలో క్రమశిక్షణా సంఘం అంటూ ఉందా, రాష్ట్ర పార్టీకి మీరు జాతీయ కార్యదర్శిగా ఎలా ఉన్నారంటూ సెటైర్లు వేసిన రఘురామకృష్ణంరాజు సాయిరెడ్డిపై దాడి మాత్రం కొనసాగించారు. తద్వారా జగన్ కు, సాయిరెడ్డికి కూడా గ్యాప్ ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. జగన్ కు తెలియకుండానే సాయిరెడ్డి తనకు నోటీసులు ఇచ్చారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. సాయిరెడ్డితో తనకు ఎలాంటి పోటీ లేదని తనకు తానే చెప్పుకున్నారు. సాయిరెడ్డికి అసలు తనపై కోపమెందుకో తెలియదన్నారు. సాయిరెడ్డి వైసీపీలో నంబర్ టూగా ఉన్నారంటూ కితాబు కూడా ఇచ్చారు.
నాది స్వామిభక్తి... నాకే నోటీసులా...
వైసీపీ అధినేత జగన్ పై గతంలో తీవ్ర విమర్శలకు దిగిన రఘురామకృష్ణంరాజు ఢిల్లీ పర్యటన తర్వాత మాత్రం వైసీపీలో నిజమైన స్వామిభక్తి ఉన్న ఎంపీ తానేనని చెప్పుకొచ్చారు. తనకు షోకాజ్ నోటీసు జారీ టీవీల్లో మాత్రమే చూశానని, షోకాజ్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని సాయిరెడ్డి పై మరోసారి విమర్శలు చేశారు. తనను పదవి నుంచి తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ తాజా ఆరోపణలు చేశారు. చివరిగా ఈ నెల 29న మధ్యాహ్నం 12 గంటలకు షోకాజ్ నోటీసుకు సమాధానం చెబుతానని, ప్రజాసమస్యల కోసమే తన పోరాటమని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు.
Recommended Video
జగన్ వ్యూహంతో ముచ్చెమటలు...
లోక్ సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా, రాజ్యసభలో ఆరో అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీకి అధినేతగా, సీఎంగా కూడా ఉన్న జగన్ కు ఢిల్లీలో ఉండే పలుకుబడిని తక్కువ అంచనా వేసిన రఘురామకృష్ణంరాజు... ఈ వ్యవహారాన్ని కేంద్రంతోనే తేల్చుకుంటానని బీరాలు పలికారు. కానీ ఢిల్లీ వెళ్లే సరికి ఆయనకు పరిస్దితి అర్ధమైంది. జగన్ పై ఫిర్యాదు కోసం వచ్చారని తెలియగానే స్పీకర్ తో పాటు మిగతా వారు కూడా మొక్కుబడిగా స్పందించారు. దీంతో ఇక చేసేది లేక జగన్ అంటే తనకు గౌరవమని, సాయిరెడ్డే అంతా చేశారంటూ స్వరం సవరించుకోక తప్పలేదు. గతేడాది పార్టీని భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకురావడంతో పాటు ఢిల్లీ పెద్దలతోనూ సత్సంబంధాలు నెరుపుతున్న జగన్ కు వ్యతిరేకంగా స్పందించేందుకు కేంద్ర మంత్రులు కానీ, ఇతర నేతలు కానీ ముందుకు రాకపోవడంతో రఘురామకృష్ణంరాజుకు అసలు విషయం బోధపడినట్లు అర్దమవుతోంది.