రఘురామ మరో సంచలనం.- నందిగం సురేష్ వ్యాఖ్యలపై లోక్సభలో ప్రివిలేజ్ నోటీస్...
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపై నిరంతరం విమర్శలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామరాజు సొంత పార్టీపై నేరుగా యుద్ధానికి దిగుతున్నట్లే కనిపిస్తోంది. తన వ్యాఖ్యలకు కౌంటర్గా వైసీపీ ఎంపీలు చేస్తున్న విమర్శలపై ఆయన దృష్టిపెట్టారు. తాజాగా ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్మీట్లో తనపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు.
వైసీపీ ఎంపీ సురేష్ ప్రెస్మీట్లో తనపై అసభ్య పదజాలంతో దూషించారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు చేసిన ఫిర్యాదులో రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్ను రఘురామ కోరారు. ఈ మేరకు సురేష్ వ్యాఖ్యల వీడియోను కూడా స్పీకర్కు అందజేశారు. ఎంపీగా ఉన్న తనను కించ పరిచే విధంగా సురేష్ వ్యాఖ్యలు ఉన్నాయని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతకుముందు నిన్న పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడిన నందిగం సురేష్.. సీఎం జగన్పై రఘరామకృష్ణంరాజు పిచ్చివాగుడు వాగితే పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వాటిపైనే రఘురామ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి రఘురామ వ్యాఖ్యలు పట్టించుకోవద్దని నేతలకు అధిష్టానం గతంలో సూచించింది. అయితే రఘురామ వ్యాఖ్యలు శృతి మించిపోతుండటంతో సురేష్ గట్టిగా కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.