సుప్రీం తీర్పుపై రఘురామ హ్యాపీ- లెఫ్టినెంట్ సునీల్ తో జగన్ పెట్టించిన కేసని సెటైర్లు
ఏపీలో వైసీపీ తరఫున ఎన్నికల్లో గెలిచి ఆ పార్టీపైనే రెండున్నరేళ్లుగా పోరాటం చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పటికీ జగన్ తో పాటు సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న ఆయనపై అనర్హత వేటు వేయాలని కూడా లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదులు వెళ్లినా ఫలితం దక్కలేదు. దీంతో వైసీపీ సర్కార్ ఆయన వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకుని రాజద్రోహం కేసు పెట్టింది. అయినా రఘురామ సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పంతం నెగ్గించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కీలకపరిణామం చోటుచేసుకుంది.
దేశవ్యాప్తంగా రాజకీయ ప్రత్యర్ధులపై ప్రభుత్వాలు రాజద్రోహం చట్టం కింద పెడుతున్న కేసుల్ని ఆపేయాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఇప్పటికే ఈ కేసులకింద అరెస్టై జైళ్లలో మగ్గుతున్న వారు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో ఇప్పటికే రాజద్రోహం కేసులో అరెస్టై బెయిల్ పై ఉన్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఊరట పొందారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు.
ప్రస్తుతం ఢిల్లీలోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు.. రాజద్రోహం కేసుపై సుప్రీంకోర్టు స్టే విధించడం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమకు నచ్చని కొందరిపై రాజద్రోహం చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని అన్నారు. లెఫ్టినెంట్ సునీల్కుమార్ చేత సీఎం జగన్ తనపై రాజద్రోహం కేసు పెట్టించారని రఘురామ సెటైర్లు వేశారు. మీడియా, ఇతరులపై కూడా రాజద్రోహం కేసు పెట్టారన్నారు.
రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన ఆదేశాలు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టుగా రఘురామ అభివర్ణించారు. రేపు ఈ ప్రభుత్వం మారడం ఖాయం. నేనే రాజు.. నేనే సీఎం అనుకుంటే కష్టం. అని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి నారాయణపై కక్ష సాధింపు కోసమే వైసీపీ సర్కార్ కేసులు పెట్టిందని ఆయన ఆరోపించారు. కక్ష సాధింపులతోనే ఏపీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. రాజధాని, రోడ్లు లేని రాష్ట్రం ఏపీ అని ఎంపీ రఘురామ వ్యంగాస్త్రాలు సంధించారు.