జగన్ పాతివ్రత్యంపై డౌట్స్: నిమ్మగడ్డకు మానసిక హింస: ఈ సారి కేసీఆర్పైనా: రాష్ట్రపతితో రఘురామ
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్కిటీ చెందిన రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని సొంత పార్టీ ప్రభుత్వంపై ఫిర్యాదులను చేయడంలో మరో అడుగు ముందుకేశారు. మొన్నటిదాకా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలను కలుసుకోవడానికే పరిమితమైన ఆయన ఏకంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్లో ఆయనతో భేటీ అయ్యారు. జగన్ సర్కార్తో పాటు ఈ సారి తెలంగాణ ప్రభుత్వంపైనా రఘురామ ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రఘురామ తన మనవడికి వైఎస్ఆర్ పేరు పెట్టారట .. ఆసక్తికర విషయాలు చెప్పిన ఎంపీ
రాష్ట్రానికి వెళ్లలేకపోతోన్నా..
రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రామ్నాథ్ కోవింద్తో కలిసి దిగిన ఫొటోను విడుదల చేశారు. రాష్ట్రంలో తనపై కుట్ర జరుగుతోందని, జగన్ అండ్ హిస్ టీమ్.. కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందనే విషయాన్ని తాను రాష్ట్రపతికి వివరించానని రఘురామ తెలిపారు. కంచే చేను మేస్తోన్న తరహాలో ప్రభుత్వ పెద్దలే తనపై అక్రమ కేసులను నమోదు చేశారని పేర్కొన్నారు. తనపై అన్ని రకాల దాడులకు పాల్పడుతోందని అన్నారు. దీనిపై రాష్ట్రపతి స్పందించారని, హోమ్ మంత్రి అమిత్ షాను కలవాలని సూచించారని అన్నారు. త్వరలో అమిత్ షాను కూడా కలుస్తానని చెప్పారు.
ప్రవీణ్ కుమార్పై చర్యలు తీసుకోవాలంటూ..
హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడాన్ని రఘురామ తప్పు పట్టారు. దేవుళ్ల పట్ల విపరీతమైన భక్తిభావం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను ఏడేళ్లుగా అదే స్థానంలో ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే చర్యలను ప్రోత్సహించకూడదని, ఈ విషయంలో తాను చూస్తూ కూర్చోలేనని తేల్చి చెప్పారు. ప్రవీణ్ కుమార్ వైఖరిని రాష్ట్రపతికి వివరించడంతో పాటు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ వద్ద ప్రస్తావిస్తానని అన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
నిమ్మగడ్డకు మానసిక హింస..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో జగన్ సర్కార్.. ఎడ్డెం అంటే తెడ్డెంలా వ్యవహరిస్తోందని రఘరామ అన్నారు. ఆయన సానుకూలంగా లేనప్పుడు ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ కోసం పట్టుబట్టటం.. ఆయన సెలవులకు వెళ్తానంటే.. అడ్డుకోవడం వంటి చర్యలు కక్షపూరితమైనవేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేస్తోన్న మానసిక దాడి నుంచి విశ్రాంతి తీసుకోవడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సెలవు అడిగితే.. మంజూరు చేయకపోవడం కక్ష సాధింపేనని అన్నారు.
ప్రత్యేక హోదా.. విశాఖ ఉక్కు..
ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ జగన్ యూటర్న్ తీసుకున్నట్టే కనిపిస్తోందని రఘురామ విమర్శించారు. ఈ విషయలో ఆయన పాతివ్రత్యంపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు నడిపించానని చెప్పుకొన్న జగన్ అండ్ హిస్ కోటరీ.. ఇప్పుడు తమ పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, కేంద్రంతో పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను రాష్ట్రానికి కేటాయించాలంటూ ప్రభుత్వం చెబుతోందని, దాని వల్ల ప్రైవేటీకరణకు అనుకూలంగా ప్రభుత్వం మొగ్గు చూపినట్టవుతుందని రఘురామ అన్నారు.
చంద్రబాబుపై కేసు ఓ డ్రామా
సాధ్యమైనంత వరకు కేంద్ర ప్రభుత్వంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ను కొనసాగేలా చర్యలను తీసుకోవాలని రఘురామ అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం ప్రాజెక్టు నిధుల బకాయిలను రప్పించుకోవడంపై శ్రద్ధ చూపాలని అన్నారు. ఒక్క రూపాయి జీతం తీసుకుంటూ ఏడు లక్షల రూపాయలకు పైగా ఆదాయపు పన్నును ప్రభుత్వం ఎలా చెల్లించిందని రఘురామ ప్రశ్నించారు. చంద్రబాబుపై సీఐడీ కేసులు నమోదు చేయడాన్ని సైతం రఘురామ తప్పుపట్టారు. ఆయనపై తప్పుడు కేసులు పెట్టారనడంలో సందేహాలు అక్కర్లేదని చెప్పారు. ఈ కేసు విషయంలో వైసీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, ఇదో పెద్ద డ్రామా అని రఘురామ అన్నారు.