రఘురామ ఆశలపై నీళ్లు ? మోడీ భీమవరం టూర్ కు జగన్ దూరం-భద్రతపై తేల్చని కేంద్రం!
విప్లవవీరుడు అల్లూరిసీతారామరాజు శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ జూలై 4 న భీమవరం వస్తున్నారు. ఏపీలో ఒక్కరోజు టూర్ లో భాగంగా భీమవరం వచ్చే ప్రధాని మోడీ.. అదే రోజు తిరిగి వెళ్లిపోతారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం జగన్, స్ధానిక ఎంపీ హోదాలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హాజరు కావాల్సి ఉంది. అదే జరిగితే జగన్, రఘురామ ఒకే వేదికపై కనిపించడం ఖాయం. కానీ అలా జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
మోడీ భీమవరం టూర్
ప్రధాని మోడీ జూలై 4న భీమవరానికి రానున్నారు. అల్లూరి సీతారామరాజు శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన భీమవరానికి వస్తున్నారు. ప్రధానీ మోడీ పాల్గొనే ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం హోదాలో వైఎస్ జగన్, స్ధానిక ఎంపీ హోదాలో రఘురామ కృష్ణంరాజు హాజరుకావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రధాని మోడీ పర్యటన కళ తప్పే అవకాశం కనిపిస్తోంది.
మోడీ టూర్ కు జగన్ దూరం
ప్రధాని మోడీ భీమవరం పర్యటనకు షెడ్యూల్ ప్రకారం సీఎం జగన్ హాజరుగావాల్సి ఉంది. అయితే జగన్ తన కుమార్తె స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 28 రాత్రి పారిస్ బయలుదేరి వెళ్లబోతున్నారు. జూలై 2న తన కుమార్తె స్నాతకోత్సవ కార్యక్రమంలో జగన్ హాజరవుతారు. ఆయన తిరిగి జూలై 5న అమరావతికి తిరిగి వస్తారు. దీంతో ప్రధాని టూర్ కు ఆయన దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి సమాచారం కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జగన్ లేకుండానే ఈ కార్యక్రమం జరిగే అవకాశాలున్నాయి.
రఘురామ ఆశలపై నీళ్లు?
ప్రధాని మోడీ భీమవరం టూర్ ఖరారు కాగానే అత్యంత సంతోషించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజే. ప్రధాని మోడీ తన సొంత నియోజకవర్గం నరసాపురం పరిధిలోకి వచ్చే భీమవరానికి వస్తుండటం, అదే సమయంలో సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉండటంతో ప్రధాని ముందే జగన్ ముందు కనిపించాలని ఆయన అనుకున్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం తనకు భద్రత కల్పించేలా జగన్ సర్కార్ కు ఆదేశాలు ఇవ్వాలని కూడా కేంద్ర హోంశాఖను రఘురామ కోరారు. అయితే ఆయన ఆశలపై నీళ్లు చల్లుతూ జగన్ ఈ టూర్ కు దూరమయ్యారు. అదే సమయంలో హోంశాఖ కూడా రఘురామ వినతిపై ఇప్పటివరకూ స్పందించలేదు. దీంతో ప్రధాని పర్యటనలో రఘురామ ఎంట్రీపై ఉత్కంఠ నెలకొంది.