సాయిరెడ్డి గారూ.. మీరు మారిపోయారు సర్.. రఘురామ ఆశ్చర్యం..పొగడ్తలు..
ఏపీలో తనతో ఎప్పుడూ ఉప్పూనిప్పూలా ఉండే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తొలిసారి పొగడ్తల జల్లు కురిపించారు.
ఏపీలో వైసీపీ తరఫున గెలిచినా, ఆ తర్వాత విభేదించడం మొదలుపెట్టి ఇప్పటికీ అదే తీరు కొనసాగిస్తున్న రెబెల్ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజుకూ, వైసీపీ కీలక ఎంపీ విజయసాయిరెడ్డికీ మధ్య నిత్యం పోరు సాగుతూనే ఉంటుంది. ట్వీట్లలోనూ, బయటా ఇరువురూ పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా అనేకం. కానీ ఇప్పుడు సాయిరెడ్డిపై రఘురామ అనూహ్యంగా ప్రశంసలు కురిపించారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో చేసిన ట్వీట్లకూ, ఇప్పుడు చేస్తున్నట్వీట్లకూ మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోందని, అలాగే ఆయన నిన్న తారకరత్న ఇంటికెళ్లి చంద్రబాబు పక్కన కూర్చుని హుందాగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోందని రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. రోజూ పెట్టే రచ్చబండ కార్యక్రమంలో సాయిరెడ్డిపై తొలిసారి విమర్శలకు బదులు ఆయన ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా సాయిరెడ్డి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని రఘురామ తెలిపారు.

సాయిరెడ్డి ట్విట్టర్ హ్యాండిల్ ను గతంలో ఎవరో నిర్వహించి ఉంటారని, అప్పట్లో దరిద్రపు ట్వీట్స్ చేస్తుండేవారని రఘురామ గుర్తుచేసుకున్నారు. రెండు నెలల్లో విజయసాయిరెడ్డి ట్వీట్లలో చాలా మార్పు కనిపిస్తోందని రఘురామ వెల్లడించారు. అలాగే నిన్న తారకరత్న ఇంటికి వచ్చిన సమయంలోనూ చంద్రబాబు పక్కన కూర్చుని సాయిరెడ్డి వ్యవహరించిన తీరు అభినందనీయం, ప్రశంసనీయం అంటూ రఘురామ కొనియాడారు. దీన్ని రాజకీయంగా చూడొద్దని ఆయన కోరారు. ఓ నాయకుడికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత ఇచ్చారంటూ సాయిరెడ్డి చంద్రబాబు పక్కన కూర్చుకోవడాన్ని ప్రస్తావించి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications