Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుప్పంలో మారుతున్న సీన్ ? భరత్ ను కాదని పోటీకి పెద్దిరెడ్డి రెడీ ! జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ?

ఏపీలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబును ఏడుసార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గంలో ఈసారి 2024 ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేయాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కుప్పంలో స్ధానికుడైన కేజే భరత్ ను రెండేళ్ల క్రితమే రంగంలోకి దింపడమే కాకుండా ఆయనకు కావాల్సిన సహకారం అందిస్తోంది. అయినా కుప్పంలో వైసీపీ పుంజుకోవడం లేదనే నివేదికలు అధిష్టానాన్ని, ముఖ్యంగా జిల్లాలో చంద్రబాబు ప్రత్యర్ధి అయిన మంత్రి పెద్దిరెడ్డిని నిరాశకలిగిస్తున్నాయి. దీంతో ఈసారి పెద్దిరెడ్డే కుప్పంలో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.

కుప్పం పాలిటిక్స్

కుప్పం పాలిటిక్స్

ఏపీ రాజకీయాల్లో సీనియర్ పొలిటిషియన్ చంద్రబాబును వరుసగా ఏడుసార్లు గెలిపించిన చరిత్ర ఉన్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంపై గతంలో ఆయన ప్రత్యర్దుల ఫోకస్ ఉండేది కాదు. చంద్రబాబును కుప్పం ఎందుకు గెలిపిస్తుందనే దానికి అభివృద్ధి, ఆయన కుల ఓటు బ్యాంకు కారణమని అందరికీ తెలిసిందే. కాబట్టి చంద్రబాబు విషయంలో పోటీకి వెళ్లి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఎందుకని వైఎస్ సహా ఇతర ప్రత్యర్ధులు భావించేవారు. అందుకనే కుప్పంనూ వారూ సీరియస్ గా తీసుకోలేదు, అలాగే చంద్రబాబు కూడా ఇక్కడ పోటీని ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. అంతా చంద్రబాబు మనుషులు చక్కబెట్టేసేవారు. ఏడాదికోసారి సంక్రాంతికి కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి చంద్రబాబు అందరినీ ఓసారి పలకరించి వెళ్లిపోయేవారు. ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు వచ్చింది లేదు. దీంతో చంద్రబాబుకు కుప్పం కంచుకోటగా మారిపోయింది. ఇక్కడ మెజారిటీని సైతం చంద్రబాబు ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుప్పంపై జగన్ ఫోకస్ పెట్టారు.

కుప్పంలో పైచేయికి వైసీపీ ప్లాన్

కుప్పంలో పైచేయికి వైసీపీ ప్లాన్

కుప్పంలో చంద్రబాబును ఓడించగలిగితే, లేదా కుప్పంలో ఓటమి భయంతో చంద్రబాబును సొంత నియోజకవర్గానికే కట్టడి చేయగలిగితే వచ్చే ఎన్నికల్లో భారీ ప్రయోజనం ఉంటుందని వైసీపీ అధినేత, సీఎం జగన్ భావించారు. దీంతో చంద్రబాబుకు జిల్లాలో చిరకాల ప్రత్యర్ధిగా ఉన్న పెద్దిరెడ్డికి ఈ పని అప్పగించారు. దీంతో గతంలో చంద్రబాబు కుప్పంలో వరుసగా గెలుస్తున్నా పట్టించుకోని పెద్దిరెడ్డి కాస్తా ఈసారి ఫోకస్ పెంచారు. తన నియోజకవర్గం పుంగనూరుతో పాటు కుప్పంలోనూ తన మనుషుల్ని పెట్టి చక్రం తిప్పడం మొదలుపెట్టారు. చంద్రబాబు కుప్పం రావాలంటేనే భయపడేలా వ్యూహాలు రచించారు. దీంతో స్దానిక సంస్ధల ఎన్నికల్లో టీడీపీ మట్టికరిచింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ చంద్రబాబును ఓడించగలమన్న ధీమా వైసీపీకి వచ్చేసింది.

కుప్పంలో పారని వైసీపీ ఎత్తులు ?

కుప్పంలో పారని వైసీపీ ఎత్తులు ?

కుప్పంలో చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో టీడీపీని ఓడించడం ద్వారా చంద్రబాబును కూడా ఓడిస్తామని సవాళ్లు చేసిన మంత్రి పెద్దిరెడ్డి, ఇతర మంత్రులు, స్ధానిక ఇన్ ఛార్జ్ కేజే భరత్ కు అతి త్వరలోనే పరిస్దితి అర్ధమైంది. కుప్పంలో తాజాగా చంద్రబాబు చేసిన పర్యటనలు దగ్గర నుంచి గమనించిన వారికి అక్కడ ఏం జరుగుతుందో అర్ధమయ్యే పరిస్ధితి. ముఖ్యంగా చంద్రబాబుపై పోటీకి వైసీపీ ఎంచుకున్న ఎమ్మెల్సీ కేజే భరత్ గెలుపు మాట అటుంచి, ఆయనకు గట్టిగా సవాల్ చేసే పరిస్ధితుల్లో కానీ, కౌంటర్ ఇచ్చే పరిస్దితుల్లో కానీ లేకుండా పోతున్నారు. దీంతో కేజే భరత్ ను కొనసాగిస్తే వైసీపీ ఓడిపోవడం ఖాయమనే అంచనాకు జగన్, పెద్దిరెడ్డి వచ్చేసినట్లు తెలుస్తోంది.

 స్వయంగా రంగంలోకి పెద్దిరెడ్డి ?

స్వయంగా రంగంలోకి పెద్దిరెడ్డి ?

కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు భరత్ ను తీసుకొచ్చినా, ఎమ్మెల్సీ చేసినా, భారీగా నిధులిచ్చినా, అధికార యంత్రాంగమంతా సహకరిస్తున్నా వైసీపీ పైచేయి సాధించడం లేదని అర్దమైంది. దీంతో మంత్రి పెద్దిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను స్వయంగా కుప్పం నుంచి పోటీ చేస్తానని నిన్న పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ అనుమతిస్తే కుప్పంతో పాటు పుంగనూరు నుంచి కూడా పోటీ చేస్తానని పెద్దిరెడ్డి చేసిన ప్రకటన జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా కుప్పాన్ని గెలిచి తీరుతామని ఇన్నాళ్లూ చెప్పిన పెద్దిరెడ్డి తానే స్వయంగా బరిలోకి దిగాల్సిన పరిస్ధితి రావడంతో అక్కడ ఏం జరుగుతుందనేది అందరికీ ఇట్టే అర్ధమవుతోంది.

 జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ?

జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ?

అయితే పెద్దిరెడ్డిని కుప్పంలోనూ పోటీ చేయించేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే పెద్దిరెడ్డి ఇప్పటికే పుంగనూరుతో పాటు జిల్లా రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నారు. ఆయనకు జిల్లాలో భారీగానే అనుచర గణం ఉంది. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. అయితే కుప్పంలో మాత్రం భిన్నమైన పరిస్దితులు ఉన్నాయి. స్ధానికంగా చంద్రబాబు సామాజిక వర్గ ఓటు బ్యాంకుతో పాటు ఆయన గెలిస్తే సీఎం అవుతారన్న నమ్మకం కూడా అక్కడి ప్రజల్లో ఎప్పుడూ ఉంటుంది. వీటన్నింటినీ అధిగమిస్తేనే పెద్దిరెడ్డి పోటీ చేసినా ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా వాస్తవాల్ని విస్మరించి బరిలోకి దిగితే పెద్దిరెడ్డికీ ఎదురుదెబ్బ తప్పకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇవే అంశాల్ని సీఎం జగన్ కూడా పరిగణనలోకి తీసుకుని పెద్దిరెడ్డిని అక్కడి నుంచి బరిలోకి దింపకపోవచ్చని తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+