ఎన్నికల మూడ్లో వైసీపీ: జగన్ దిశా నిర్దేశం
అమరావతి: వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ప్రత్యర్థి పార్టీలకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదని, 175 స్థానాల్లోనూ పార్టీ జెండా ఎగరాలనే పట్టుదలతో ఉన్నారాయన. దీనికోసం వైనాట్ 175 కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారు.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. ఈ విషయంలో రాజీపడట్లేదు. సరిగ్గా పనిచేయని, జనంలో లేని ఎమ్మెల్యేలకు టికెట్ల దక్కబోవంటూ ఇదివరకే హెచ్చరించారు కూడా. కనీసం 30 మంది సిట్టింగులకు ఈ సారి టికెట్లు దక్కబోవనే ప్రచారం సైతం ఉంది.

ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడానికి, పరిపాలన- సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయాలను సేకరించడానికి ఇదివరకు పలు కార్యక్రమాలను నిర్వహించింది ప్రభుత్వం. ప్రజల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ను తీసుకుంది. టికెట్ల కేటాయింపులో వాటిని ప్రాతిపదికగా తీసుకుంటోన్నారు వైఎస్ జగన్.
వచ్చే ఏడాది ఏప్రిల్/మేల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో- ఎన్నికల దిశగా మరో కీలక అడుగు ముందుకేశారు వైఎస్ జగన్. పార్టీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ఈ భారీ సభకు వేదిక. ఈ ఉదయం 9:30 గంటలకు సభ ఆరంభమౌతుంది.
వైఎస్ జగన్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వీ విజయసాయిరెడ్డి, అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.. సహా రీజినల్ కోఆర్డినేటర్లతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు.. ఇలా అన్ని స్థాయిల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు.
ఈ ఉదయం 10:30 గంటలకు వైఎస్ జగన్ ఈ సమావేశానికి హాజరవుతారు. ఎన్నికల దిశగా వారందరికీ దిశానిర్దేశం చేస్తారు. ఇంటింటికీ సంక్షేమ పథకాల గురించి వివరించడం, గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై పర్యవేక్షించడం, ఇంకా అదనంగా ప్రజలకు అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు.












Click it and Unblock the Notifications