ఎన్నికలకు వైయస్ జగన్ పార్టీ దూరం, తటస్థమే
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకుంది. తగిన సంఖ్యాబలం లేకపోకపోవడంతో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు ఎంవి మైసురా రెడ్డి గురువారం ధ్రువీకరించారు. ఈ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వకూడదని, తాము ఎవరి మద్దతూ తీసుకోకూడదని నిర్ణయించుకుంది.
ఇతర పార్టీల బలం మీద ఆధారపడి అభ్యర్థిని నిలబెడితే అది కుమ్మక్కు రాజకీయాల్లో భాగమేననేది తమ అభిప్రాయమని ఆయన అన్నారు. విభజనకు అనుకూలంగా మూడు రాజకీయ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్సించారు. శాసనసభ ఎన్నికల తర్వాత రాజ్యసభ ఎన్నికలు జరిగితే ఓడిపోతామని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు భయపడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్నికల ప్రక్రియను ముందుకు జరిపేలా ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తెచ్చాయని ఆయన అన్నారు అయితే, ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను గెలిపించుకునే సంఖ్యాబలం టిడిపికి ఇప్పుడు లేదని ఆయన అన్నారు. కాంగ్రెసుతో కుమ్మక్కు కావడం వల్లనే రెండో అభ్యర్థిని తెలుగుదేశం నిలబెడుతోందని ఆయన న్నారు.
కాగా, తెలంగాణ ముసాయిదా బిల్లు విషయంలో కేంద్ర సూచన మేరకే రాష్ట్రపతి వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం సీమాంధ్ర ప్రాంత శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియను సజావుగా జరుపుకునేందుకే తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చకు గడువు పెంచారని ఆయన అన్నారు.
బిల్లుపై మారని వైఖరి
తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభ చర్చ విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన వైఖరిని మార్చుకోలేదు. బిల్లుపై ఓటింగ్ ఉండాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెసు శాసనసభా పక్ష నేత వైయస్ విజయమ్మ అన్నారు.












Click it and Unblock the Notifications