సోషల్ మీడియాలో వైసీపీ నయా ట్రెండ్ - 2024 ఎన్నికలే లక్ష్యంగా..!!
వచ్చే ఎన్నికల కోసం వైసీపీ సిద్దమవుతోంది. ఇప్పటికే పార్టీ శ్రేణులు గడప గడపకు వెళ్తున్నాయి. తాము అమలు చేసిన సంక్షేమం తిరిగి అధికారం అప్పగిస్తుందనే నమ్మకంతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్షాలు పొత్తులతో సీఎం జగన్ పై రాజకీయ యుద్దానికి సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ వెనుక వ్యూహకర్తలు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా వైసీపీ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.
ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు స్వీకరించి ఈ నెల 30వ తేదీకి నాలుగేళ్లు పూర్తవుతుంది. ఇదే సమయంలో రానున్న ఎన్నికలపైన సీఎం జగన్ ఫోకస్ చేసారు. ఎన్నికల కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తన కేడర్ ను సంసిద్దులను చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రచారం కీలకంగా మారుతోంది.
2019 ఎన్నికల సమయంలోనూ వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్ గా పని చేసింది. ఇప్పుడు తిరిగి పని మొదలు పెట్టింది. #YSRCPAgain2024 హ్యాష్టాగ్తో ట్విటర్లో ట్రెండింగ్ చేస్తోంది. తిరిగి అధికారం కోసం వైసీపీ అమలు చేసిన నిర్ణయాల ప్రచారం కోసం ఈ ట్రెండింగ్ కొనసాగుతోంది. ప్రారంభించిన కొద్ది సేపట్లోనే ట్రెండింగ్ లోకి వచ్చింది.

ఈ హ్యాష్ టాగ్ కింద సీఎం జగన్ పాదయాత్ర.. ప్రమాణ స్వీకారం.. నవరత్నాలు..పాలనా పరమైన నిర్ణయాలో వరుసగా ట్వీట్లు కనిపిస్తున్నాయి. వైసీపీ నేతలతో పాటుగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తున్నారు. అభిమానులు ట్వీట్లను షేర్ చేస్తున్నారు. 2019లో 151 అసెంబ్లీ..22 లోక్ సభ సీట్లు సాధించిన వైసీపీ ఈ సారి ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకొనే దిశగా అడుగులు వేస్తోంది.
సంక్షేమం - సామాజిక న్యాయం ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలచుకుంటోంది. ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా జనసేన - టీడీపీ కలసి వస్తే బీజేపీతో పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నాయి. దీంతో రాజకీయం గా సీఎం జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ 47 నెలల కాలంలో సంక్షేమ పథకాల కింద ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో రూ 2.10 లక్షల కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ప్రతీ ఇంటికి మంచి చేసామని ప్రభుత్వం చెబుతోంది. మంచి జరిగి ఉంటే అండగా నిలవాలని ముఖ్యమంత్రి కోరుతున్నారు. ఈ సమయంలో ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మరింత ప్రచారంలోకి వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. దీంతో..ఇప్పుడు 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేస్తున్న ప్రచారం ట్రెండింగ్ లో నిలిచింది.












Click it and Unblock the Notifications