కాంగ్రెస్ పార్టీలో వైయస్సార్టీపీ విలీనమా? యస్!: ఢిల్లీలో షర్మిల, అగ్రనేతలతో భేటీ
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల బుధవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి వచ్చిన అనంతరం విజయవాడ నుంచి ఆమె ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ చేరుకున్న వైఎస్ షర్మిల.. గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవనున్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల సమక్షంలో వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైఎస్ షర్మిలకు ఏఐసీసీలో చోటు కల్పించడం లేదా? ఏపీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో అడుగుపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. అవునని సమాధానం ఇచ్చారు షర్మిల.

వైయస్సార్టీపీ తెలంగాణ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన విషయం తెలిసిందే. తమ మద్దతు కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని షర్మిల పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేయాలని షర్మిల నిర్ణయించుకోవడం గమనార్హం.
#WATCH | Delhi: On joining Congress, YSR Telangana Party (YSRTP) president, YS Sharmila says, "Yes looks like it. We will know tomorrow..." pic.twitter.com/k6kZlJOJLX
— ANI (@ANI) January 3, 2024
జగన్ ఇంటికెళ్లిన షర్మిల కుటుంబం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి కుటుంబంతో సహా వెళ్లారు వైయస్సార్టీపీ తెలంగాణ అధ్యక్షురాలు, ఆయన సోదరి వైఎస్ షర్మిల. భర్త అనిల్, కుమారుడు వైఎస్ రాజా రెడ్డి, కోబోయే కోడలు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని.. అక్కడ్నుంచి సీఎం జగన్ నివాసానికి షర్మిల వెళ్లారు.
దాదాపు అరగంటపాటు షర్మిల, జగన్ కుటుంబాలు సమావేశమయ్యాయి. అన్న వైఎస్ జగన్, వదిన వైఎస్ భారతిని కలిసి తన కుమారుడు రాజా రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు షర్మిల. అనంతరం విజయవాడలోని నోవాటెల్ హోటల్ కు బయల్దేరారు. అక్కడ విశ్రాంతి తీసుకుని.. బుధవారం రాత్రి 8.50 నిమిషాలకు ఢిల్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ. తన కుమారుడి వివాహానికి జగన్ను ఆహ్వానించినట్లు తెలిపారు. అందుకు జగన్ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications