సిటీ బస్ కండక్టర్గా సిద్ధరామయ్య
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో కీలకమైనది- ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. శక్తి పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. లగ్జరీ, ఏసీ బస్సులు మినహా- మిగిలిన అన్నింట్లోనూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
బెంగళూరు సిటీ బస్సులతో పాటు కేఎస్ఆర్టీసీ, ఈశాన్య ఆర్టీసీ, వాయవ్య ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది. ఈ నెల 11వ తేదీ నుంచి ఇది అమలులోకి రానుంది. ఈ శక్తి పథకానికి పాలనాపరమైన ఆమోదం లభించింది. ఈ మేరకు రవాణా శాఖ కార్యదర్శి పుష్ప వీఎస్ ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి శక్తి స్మార్ట్ కార్డ్ తప్పనిసరి. దీన్ని పొందడానికి సేవా సింధు పోర్టల్ ద్వారా దరఖాస్తులను దాఖలు చేయాల్సి ఉంటుంది. అనుమతి లభించిన మహిళలకు శక్తి స్మార్ట్ కార్డ్లను ప్రభుత్వం అందజేస్తుంది. కర్ణాటక భూభాగంపై తిరుగాడే ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది.
ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారు సరిహద్దుల్లో ఉన్న స్టేజీ నుంచి గమ్యస్థానానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్డబ్ల్యూ ఆర్టీసీ), కళ్యాణ కర్ణాటక/నార్త్ ఈస్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఈశాన్య ఆర్టీసీ) బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
అన్ని ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. విద్యార్థినులకు కూడా ఈ సౌకర్యం వర్తిస్తుంది. రాజహంస, వజ్ర, వాయు వజ్ర, ఐరావత, ఐరావత క్లబ్ క్లాస్, ఐరావత గోల్డ్ క్లాస్, అంబారీ, అంబారీ డ్రమ్ క్లాస్, అంబారీ ఉత్సవ్, ఎఫ్టి బస్, ఈవీ పవర్ ప్లస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చిన బస్సుల్లో 50 సీట్లను పురుషుల కోసం రిజర్వ్ చేశారు.
ఈ పథకాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. కండక్టర్ అవతారం ఎత్తనున్నారు. దీనికోసం బెంగళూరులోని మెజస్టిక్ కెంపెగౌడ బస్స్టేషన్ నుంచి విధాన సౌధ వరకు రూట్ నంబర్ 43 సిటీ బస్లో ప్రయాణించనున్నారు. స్వయంగా ప్రయాణికులకు టికెట్లను జారీ చేయనున్నారు. మహిళలకు స్మార్ట్ కార్డ్ను కూడా ఆయన అందజేస్తారు. పురుష ప్రయాణికులకు బస్ టికెట్లను జారీ చేస్తారు.
మిగిలిన నాలుగు ఉచిత పథకాలను కూడా త్వరలోనే ప్రారంభించనున్నారాయన. దీనికోసం నాలుగు వేర్వేరు జిల్లాల్లో బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నారు. శక్తి పథకాన్ని బెంగళూరు, అన్నభాగ్య- మైసూరు, బెళగావి జిల్లాలోని కిత్తూరులో గృహలక్ష్మి, కలబురగిలో గృహజ్యోతి, మంగళూరులో యువనిధి పథకాన్ని సిద్ధరామయ్య లాంఛనంగా ప్రారంభిస్తారు.












Click it and Unblock the Notifications