ఉప ఎన్నికల బరిలో ఐఎఎస్ అధికారి భార్య: కాంగ్రెస్ తరఫున: కర్ణాటకలో బీజేపీతో ఢీ అంటే ఢీ
బెంగళూరు: కర్ణాటకలో దివంగత ఐఎఎస్ అధికారి డీకే రవి భార్య హెచ్ కుసుమ ఉప ఎన్నికల బరిలో దిగారు. కాంగ్రెస్ తరఫున ఆమె పోటీ చేస్తున్నారు. హెచ్ కుసుమ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె హస్తం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఐఎఎస్ అధికారి డీకే రవి.. 2015లో బెంగళూరు కోరమంగల ప్రాంతంలోని తన నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆక్రమణలను తొలగించడంలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరున్న డీకే రవి మరణంపై అనుమానాలు వ్యక్తం కావడంతో అప్పట్లో సీబీఐ దర్యాప్తు సైతం కొనసాగించింది.
కాగా- వచ్చేనెల 3వ తేదీన కర్ణాటకలో ఖాళీగా ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలను నిర్వహించనున్నారు. రాజరాజేశ్వరి నగరతో పాటు తుమకూరు జిల్లా శిరా నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. రాజరాజేశ్వరి నగర స్థానానికి హెచ్ కుసుమ, శిరా నుంచి టీబీ జయచంద్రను కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది. డీకే రవి భార్య హెచ్ కుసుమ ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ నెల 4వ తేదీన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ కండువాను కప్పుకొన్నారు.

టీబీ జయచంద్ర రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి, జనతాదళ్ (సెక్యులర్) అభ్యర్థి సత్యనారాయణను ఓడించారు. 2018 ఎన్నికల్లో అదే సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు. సత్యనారాయణ మృతితో ప్రస్తుతం ఈ స్థానం ఖాళీ అయింది. కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) పొత్తు కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్థానంలో జేడీఎస్ అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు దాదాపుగా లేనట్టేనని అంటున్నారు. టీబీ జయచంద్రకే జేడీఎస్ మద్దతు ఇస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.












Click it and Unblock the Notifications