Puneeth Rajkumar: కంఠీరవ స్టూడియోలో పార్థివదేహం: అంత్యక్రియలు మొదలు
బెంగళూరు: గుండెపోటుతో కన్నుమూసిన శాండల్వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్.. పార్థివదేహానికి అంతిమయాత్ర మొదలైంది. ఆరాధ్యదైవంగా కొలిచే లక్షలాది మంది అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఆయనను పార్థివదేహాన్ని ఉంచిన కంఠీరవ స్టేడియం నుంచి ఈ అంతిమయాత్ర మొదలైంది. కంఠీవర స్టేడియం నుంచి కంఠీరవ స్టూడియో వరకు సుమారు 12 కిలోమీటర్ల దూరం పాటు అంతిమయాత్ర కొనసాగుతుంది.
పార్థివదేహం పక్కనే..
ఈ తెల్లవారు జామున 5 గంటలకే అంతిమయాత్ర కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రభుత్వం అమర్చిన వాహనాన్ని కంఠీరవ స్టేడియానికి చేరుకుంది. ఆయన పార్థివదేహాన్ని అందులో ఉంచారు. వాహనాన్ని పూలతో అలంకరించారు. ముందువైపు పునీత్ రాజ్కుమార్ చిత్రపటాన్ని అమర్చారు. పార్థివదేహం వద్ద ఇద్దరు అన్నలు, శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్, భార్య అశ్విని రేవంత్ కూర్చున్నారు. స్టేడియం వెనుక వైపు గేట్ నుంచి వాహనం కంఠీరవ స్టూడియోకు బయలుదేరింది.
ఈ మార్గాల మీదుగా..
హడ్సన్ సర్కిల్, పోలీస్ కార్నర్, కేజీ రోడ్, మైసూర్ బ్యాంక్ సర్కిల్, పోస్టాఫీస్ రోడ్, కేఆర్ సర్కిల్, శేషాద్రి రోడ్, మహారాణి ఫ్లైఓవర్, సీఐడీ జంక్షన్, చాలుక్య సర్కిల్, టీ చౌడయ్య రోడ్, విండ్సర్ మ్యానర్ జంక్షన్, బీడీఏ, పీజీ హళ్లి క్రాస్, కావేరీ జంక్షన్, భాష్యం సర్కిల్, స్యాంకీ రోడ్, మల్లేశ్వరం 18వ క్రాస్, మారెమ్మ సర్కిల్, బీహెచ్ఈఎల్ సర్వీస్ రోడ్, యశవంతపుర సర్కిల్, మారప్పన పాళ్య, గోవర్ధన టాకీస్, ఆర్ఎంసీ యార్డ్, ఎంఈఐ బస్స్టాప్, గురగొంట పాళ్య జంక్షన్, సీఎంటీఐ జంక్షన్, లారీ అసోసియేషన్ ఆఫీస్, ఎఫ్టీఐ ఆఫీస్ రోడ్ మీదుగా కంఠీరవ స్టేడియానికి చేరుకుంది.
ముఖ్యమంత్రి హాజరు..
అంతిమయాత్ర కంఠీరవ స్టూడియోకు చేరుకున్న కొద్ది సేపటికే ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పలువురు మంత్రులు, ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. కంఠీరవ స్టూడియోలో.. తండ్రి రాజ్కుమార్ సమాధికి 125 అడుగులు, తల్లి పార్వతమ్మ సమాధికి 45 అడుగుల దూరంలో పునీత్ పార్థివ దేహానికి అంత్యక్రియలను నిర్వహిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ దారి పొడవునా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
వినయ్ రాజ్కుమార్ చేతుల మీదుగా..
పునీత్ రాజ్కుమార్కు ఇద్దరూ కుమార్తెలే. ధృతి రాజ్కుమార్, వందిత రాజ్కుమార్. అంత్యక్రియలను నిర్వహించే వీలు లేదు. అలాగే- పునీత్ పెద్దన్న శివరాజ్ కుమార్కు కూడా ఇద్దరూ కుమార్తెలే ఉన్నారు. వారి పేర్లు నివేదిత, నిరుపమ. వారికి కూడా అంత్యక్రియలను నిర్వహించడానికి వెసలుబాటు లేదు. పునీత్ రెండో అన్న రాఘవేంద్ర రాజ్కుమార్కు ఇద్దరు కుమారులు. ఆయనకు కుమార్తెలు లేరు. వారి పేర్లు వినయ్ రాజ్కుమార్, యువరాజ్ కుమార్. వారిలో రాఘవేంద్ర పెద్ద కుమారుడు వినయ్ రాజ్కుమార్ చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలను నిర్వహిస్తారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.