High Court: ప్రియురాలు, ఆమె పిల్లల హత్య కేసులో ట్విస్ట్, హైకోర్టు సంచలన తీర్పు, ప్రియుడు నిర్దోషి!
బెళగావి/బెంగళూరు: అక్రమ సంబంధం కారణంగా మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడని అరెస్టు అయ్యి జిల్లా కోర్టులో యావజ్జీవ శిక్షకు గురైన యువకుడు హైకోర్టు తీర్పుతో నిర్దోషిగా బయటపడ్డాడు. తాను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తన ప్రియురాలు అడ్డుపడుతోందని కోపంతో ఆ యువకుడు ప్రియురాలితో పాటు ఆమె ఇద్దరు పిల్లలను చంపేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణ చేసిన జిల్లా కోర్టు నిందితుడు మూడు హత్యలు చేశాడని, అతనికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తామని గతంలో తీర్పు చెప్పింది.
జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆ యువకుడు హైకోర్టును ఆశ్రయించాడు. కేసు విచారణ చేసిన హైకోర్టు ద్విసభ్య బెంచ్ సరైన సాక్షాలు లేవని చెప్పి త్రిబుల్ మర్డర్ కేసులో ఆ యువకుడిని నిర్దోషిగా ప్రకటించడంతో అతను జైలు నుంచి విడుదలైనాడు. త్రిబుల్ మర్డర్ కేసులో ఇంతకాలం ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు వెలుగు చూశాయి.
Illegal affair: వివాహిత మహిళతో యువకుడి అక్రమ సంబంధం, జల్సాలు, సీన్ కట్ చేస్తే ఇద్దరి శవాలు!
వివాహిత మహిళ, ఇద్దరు పిల్లలు దారుణ హత్య
కర్ణాటకలోని బెళగావిలోని కువెంపు నగర్ లో నివాసం ఉంటున్న రీనా మాలగత్తి అలియాస్ రీనా అనే మహిళ, ఆమె కుమారుడు ఆదిత్యా, కుమార్తె సాహిత్యా 2015 ఆగస్టు 16వ తేదీన దారుణ హత్యకు గురైనారు. రీనా బెడ్ రూమ్ లోనే ఆమెతో పాటు ఆమె ఇద్దరు పిల్లలను కత్తితో పొడిచి దారుణంగా చంపేయడం అప్పట్లో బెళగావితో పాటు కర్ణాటకలో కలకలం రేపింది.
త్రిబుల్ మర్డర్ కేసులో ప్రియుడు అరెస్టు
రీనా, ఆమె పిల్లల దారుణ హత్యల కేసులో ప్రవీణ్ భట్ అనే యువకుడిని బెళగావి పోలీసులు అరెస్టు చేశారు. గత రెండు సంవత్సరాల నుంచి రీనా, ప్రవీణ్ భట్ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారని, ఇద్దరూ పదేపదే ఫోన్లలో మాట్లాడుకుంటున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
పెళ్లికి అడ్డుపడుతోందని చంపేశాడు
తాను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తన ప్రియురాలు రీనా అడ్డుపడుతోందని కోపంతో ప్రవీణ్ భట్ ప్రియురాలితో పాటు ఆమె ఇద్దరు పిల్లలు ఆదిత్యా, సాహిత్యాలను చంపేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. రీనా బెడ్ రూమ్ లోని రక్తపు మరకలు ప్రవీణ్ కు అంటుకున్నాయని, అక్కడ చిక్కిన కత్తి మీద అతని వేలిముద్రలు ఉన్నాయని పోలీసులు అప్పట్లో చెప్పారు.
యావజ్జీవ శిక్ష విధించిన జిల్లా కోర్టు
ప్రవీణ్ భట్ నేరం చేశాడని అంగీకరించాడని బెళగావి పోలీసులు 514 పేజీల చార్జ్ షీట్ తయారు చేసి కోర్టు ముందు సమర్పించారు. పోలీసులు సమర్పించి సాక్షాలు, కేసు వివరాలను కోర్టు పరిశీలించింది. రీనా, ఆమె పిల్లల హత్య కేసు విచారణ చేసిన జిల్లా కోర్టు 2018 ఏప్రిల్ 16వ తేదీన ప్రవీణ్ భట్ కు యావజ్జీవ కారాగార శిక్షవిధించింది.
హైకోర్టులో రిలీఫ్
జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రవీణ్ భట్ ధారవాడ హైకోర్టును ఆశ్రయించాడు. కేసు విచారణ చేసిన ధారవాడ హైకోర్టు ద్విసభ్య బెంచ్ సరైన సాక్షాలు లేవని చెప్పి త్రిబుల్ మర్డర్ కేసులో జైలు శిక్షకు గురైన ప్రవీణ్ భట్ ను నిర్దోషిగా ప్రకటించడంతో అతను జైలు నుంచి విడుదలైనాడు.