DA Hike: డబుల్ ధమాకా, జీతాల పెంపు ప్రక్రియ స్పీడ్ అప్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th CPC) పనులు వేగవంతమయ్యాయి. దాదాపు 55 లక్షల మంది ప్రస్తుత ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్ల జీతభత్యాలు, పెన్షన్ల సవరణకు సంబంధించి ఈ కమిషన్ మరికొద్ది నెలల్లో కీలక సిఫార్సులు చేయనుంది. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు (మెమోరాండం) స్వీకరించే గడువు జూన్ 15తో ముగిసింది. దీంతో ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన భాగస్వాముల సంప్రదింపుల దశ పూర్తయినట్లయింది.
సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు కరువు భత్యం (DA), పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (DR) ప్రకటిస్తుంది. ఈ ఏడాది జనవరికి సంబంధించిన 2 శాతం డీఏ పెంపును ఏప్రిల్ 18న అధికారికంగా ప్రకటించగా, ప్రస్తుతం మొత్తం డీఏ రేటు 60 శాతానికి చేరింది.

కాగా, తదుపరి విడత (జులై నుంచి వర్తించే) డీఏ ప్రకటన ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో వెలువడే అవకాశం ఉందని ఆల్ ఇండియా ఎన్పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ మంజీత్ సింగ్ పటేల్ తెలిపారు. జులై నెలకు సంబంధించిన డీఏను ఖరారు చేయడానికి కనీసం 2 నుండి 3 నెలల వినియోగదారుల ధరల సూచీ (AICPI-IW) డేటా అవసరమవుతుందని, అందుకే ఈ ప్రకటన సెప్టెంబర్లో వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు.
ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే..
8వ పే కమిషన్కు గడువు లోపల అందిన మెమోరాండాలలో ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు తమ ప్రధాన డిమాండ్లను పొందుపరిచాయి. వాటిలో ముఖ్యమైనవి:
- కనీస ప్రాథమిక వేతనాన్ని (Minimum Basic Pay) భారీగా పెంచాలి.
- ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను (Fitment Factor) పెంచడం ద్వారా జీతాలు, పెన్షన్లు మెరుగుపరచాలి.
- పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి లేదా ప్రస్తుత ఎన్పీఎస్/యూపీఎస్ (NPS/UPS) విధానాలను సమీక్షించాలి.
- హెచ్ఆర్ఏ (HRA), రిస్క్ పే, బోనస్లు, లీవ్ బెనిఫిట్స్ వంటి అలవెన్సులను పెంచాలి.
- ఇప్పుడు కమిషన్ ఈ ప్రతిపాదనలన్నింటినీ కూలంకషంగా పరిశీలించి తదుపరి చర్చలను వేగంగా ముగించనుంది.
రాష్ట్రాల పర్యటనలో పే కమిషన్..
మరోవైపు 8వ వేతన సంఘం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పర్యటిస్తూ క్షేత్రస్థాయి పరిశీలనలు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, లడఖ్, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ (తెలంగాణ), మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాలలో స్టేక్హోల్డర్లతో సంప్రదింపులు పూర్తి చేసింది. తాజాగా రాబోయే రోజుల్లో లక్నో (ఉత్తరప్రదేశ్ - జూన్ 22-23), భువనేశ్వర్ (ఒడిశా - జులై 6-7), కోల్కతా (పశ్చిమ బెంగాల్ - జులై 9-10) లలో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 2025లో ఏర్పాటైన ఈ కమిషన్ గడువు ముగియడానికి ఇంకా 10 నెలల సమయం ఉండటంతో, ఆలోపే తుది నివేదిక సిద్ధం కానుంది.














Click it and Unblock the Notifications