అదానీ పవర్ చేతికి భాగల్పూర్ విద్యుత్ ప్రాజెక్ట్.. రూ.30,000 కోట్ల పెట్టుబడితో !
బీహార్ ప్రభుత్వం 2,400 మెగావాట్ల సామర్థ్యం గల భాగల్పూర్ (పిర్పైంటి) విద్యుత్ ప్రాజెక్టును అదానీ పవర్ లిమిటెడ్కి కేటాయించింది. రూ. 6.075 యూనిట్ టారిఫ్తో ఈ సంస్థ అత్యల్ప బిడ్ను సమర్పించి ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. దీంతో పోటీదారులైన టొరెంట్ పవర్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, లలిత్పూర్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్లకు బిగ్ షాక్ తగిలినట్టైంది. ఈ నిర్ణయం బీహార్ రాష్ట్రంలో పరిశ్రమల వృద్ధి, ఉద్యోగ కల్పన.. మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు.
కాగా పూర్తిగా పారదర్శకతతో ఈ-బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహించబడిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. అదానీ పవర్ యూనిట్కి రూ. 6.075 టారిఫ్ను కోట్ చేయగా.. ఇందులో రూ. 4.165 ఫిక్స్డ్ ఛార్జ్, రూ. 1.91 ఇంధన ఛార్జ్ ఉన్నాయని స్పష్టం చేశాయి. ఇది మధ్యప్రదేశ్లో జరిగిన తాజా బిడ్ల కంటే తక్కువగా ఉందని.. అక్కడ ఫిక్స్డ్ ఛార్జ్ యూనిట్కి రూ. 4.222 నుంచి రూ. 4.298 వరకు నమోదైందన్నారు. దాంతో బీహార్ ప్రాజెక్ట్ టారిఫ్ దేశవ్యాప్తంగా అత్యంత పోటీ ధరలలో ఒకటిగా నిలిచింది.

విద్యుత్ డిమాండ్..
ప్రస్తుతం బీహార్ రాష్ట్ర విద్యుత్ డిమాండ్ సుమారు 8,000 మెగావాట్లుగా ఉంది. 2034-35 నాటికి ఇది 17,000 మెగావాట్లకు పైగా చేరుకునే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో భాగల్పూర్ విద్యుత్ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసినప్పుడు.. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా లోటును గణనీయంగా తగ్గించగలదని భావిస్తున్నారు. ఇది పరిశ్రమల విస్తరణ, గ్రామీణ విద్యుదీకరణ, పట్టణాభివృద్ధికి పునాది వేస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధి అవకాశాలు..
అదానీ గ్రూప్ ఈ ప్రాజెక్టులో సుమారు రూ. 30,000 కోట్ల పెట్టుబడిని ప్రణాళిక చేసింది. ఈ భారీ పెట్టుబడి నేరుగా 8,000 మందికి పైగా ఉద్యోగాలు, పరోక్షంగా దాదాపు 25,000 ఉద్యోగ అవకాశాలను సృష్టించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మౌలిక సదుపాయాల రంగంలో ప్రతి రూ. 1 కోటి పెట్టుబడి 200-250 మానవ సంవత్సరాల ఉపాధిని కల్పిస్తుందని గృహనిర్మాణ నిపుణుడు వి. సురేష్ తెలిపారు.
పారిశ్రామిక పునరుజ్జీవనానికి దోహదం..
అంతే కాకుండా గత అయిదు దశాబ్దాలుగా బీహార్లో పెద్దగా ప్రైవేట్ పెట్టుబడులు రాలేదు. విద్యుత్ కొరత, రోడ్డు మౌలిక సదుపాయాల లోపం, పారిశ్రామిక విధానాల లోపం కారణంగా అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకంజ వేశాయి. అయితే భాగల్పూర్ ప్రాజెక్ట్ ప్రారంభం బీహార్ పారిశ్రామిక పునరుజ్జీవనానికి దారితీసే కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలోని సిమెంట్, ఇనుము, రసాయన, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు స్థిరమైన విద్యుత్ సరఫరాను నిర్ధారించగలదని ఆశాభావం వ్యక్తం అవుతోంది.
భూమి కేటాయింపు & ప్రభుత్వ నిబంధనలు..
ఇక ఈ ప్రాజెక్ట్ మొదటిసారి 2012లో ప్రతిపాదించబడింది. కానీ ఆర్థిక సవాళ్ల కారణంగా పలు సార్లు నిలిచిపోయింది. 2024లో తిరిగి టెండర్లు ఆహ్వానించడంతో.. ఈసారి విజయవంతంగా పూర్తయింది. ప్రాజెక్ట్కు కావాల్సిన భూమి ఇప్పటికే ప్రభుత్వ యాజమాన్యంలో ఉండటంతో బీహార్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ పాలసీ 2025 ప్రకారం అదానీ గ్రూప్కు నామమాత్రపు అద్దెకు లీజు ఇచ్చింది. ప్రాజెక్టు కాలపరిమితి పూర్తయిన తర్వాత ఆ భూమి తిరిగి ప్రభుత్వానికి వస్తుందని అధికారులు తెలిపారు.
రాజకీయ వాదనలు & వివాదాలు..
ఈ ప్రాజెక్ట్ కేటాయింపు ఎన్నికల సీజన్లో రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఆర్.కె. సింగ్ చేసిన “స్కామ్” వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఊపునిచ్చాయి. కాంగ్రెస్ నాయకుడు కె.సి. వేణుగోపాల్ ఎక్స్ (ట్విట్టర్)లో చేసిన పోస్టులో “అదానీ గ్రూప్కు బీహార్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ ట్రీట్మెంట్ ఇస్తోందని” ఆరోపించారు. ఇదే సమయంలో అధికార బీజేపీ నేతలు మాత్రం ఈ బిడ్డింగ్ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని.. ప్రజలకు తక్కువ ధరకు విద్యుత్ అందించడం లక్ష్యం అని సమాధానం ఇచ్చారు.
మరోవైపు బీహార్లో సుమారు 13.5 కోట్ల జనాభాలో సగం మంది ఇప్పటికీ వ్యవసాయం, అటవీ, మత్స్య పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. కేవలం 5.7% శ్రామికశక్తి మాత్రమే తయారీ రంగంలో పనిచేస్తోంది. ఈ విద్యుత్ ప్రాజెక్ట్ ప్రారంభమైతే, కొత్త పరిశ్రమలు ఏర్పడి.. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. విద్యుత్ సరఫరా స్థిరపడితే, బీహార్ నుండి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే కార్మికుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు.
అదానీ గ్రూప్ ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, సిమెంట్ (రూ. 1,600 కోట్ల పెట్టుబడితో), లాజిస్టిక్స్, విమానాశ్రయ కార్యకలాపాలలో విశాల అనుభవం కలిగి ఉంది. ఈ అనుభవం భాగల్పూర్ ప్రాజెక్ట్ సమర్థవంతమైన నిర్వహణకు సహాయపడుతుంది. అదానీ పవర్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత బీహార్ తూర్పు భారతదేశంలో ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
-
Adani:అదానీ పోర్ట్స్ కొలంబో టెర్మినల్ సరికొత్త రికార్డు.. ఏడాదిలోనే మిలియన్ TEU మైలురాయి -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్












Click it and Unblock the Notifications