కార్ లవర్స్కు బిగ్ షాక్: జులై 1 నుంచి పెరగనున్న ఆ కార్ల ధరలు!
ఇండియాలో లగ్జరీ కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రముఖ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ బిగ్ షాక్ ఇచ్చింది. వచ్చే జులై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గత రెండు, మూడు నెలలుగా వివిధ వాహన సంస్థలు ఇప్పటికే ధరలను పెంచగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి బీఎండబ్ల్యూ కూడా చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ బలహీనపడటం అలాగే రవాణా ఖర్చులు భారీగా పెరగడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణాలు అని కంపెనీ వెల్లడించింది.
ఈ తాజా నిర్ణయం ప్రకారం.. బీఎండబ్ల్యూ, మినీ రేంజ్కు చెందిన అన్ని మోడళ్ల కార్ల ధరలు జులై 1 నుంచి 2 శాతం మేర పెరగనున్నాయి. పెరిగిన ఇన్పుట్ ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని సంస్థ పేర్కొంది. ఈ విషయంపై బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో హర్దీప్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ.. "మార్కెట్లో మా ఉత్పత్తులకు ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా లగ్జరీ మొబిలిటీ విభాగంలో బీఎమ్డబ్ల్యూ సరికొత్త మైలురాళ్లను సృష్టిస్తోంది. అయితే ప్రస్తుత స్థూల ఆర్థిక సవాళ్ల నడుమ మా ప్రీమియం ప్రమాణాలను అలాగే కొనసాగించేందుకు పోర్ట్ఫోలియో ధరలను 2 శాతం పెంచుతున్నాం" అని స్పష్టం చేశారు.

ఇండియాలో బీఎండబ్ల్యూ సంస్థకు చెందిన పలు మోడళ్లు స్థానికంగానే తయారవుతున్నాయి. వీటిలో డీఎండబ్ల్యూ 2 సిరీస్ కూపే, 3 సిరీస్ లాంగ్ వీల్ బేస్, 5 సిరీస్ లాంగ్ వీల్ బేస్, 7 సిరీస్, ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7లతో పాటు డీఎండబ్ల్యూ ఎమ్340ఐ, ఐఎక్స్1 లాంగ్ వీల్ బేస్ వంటి మోడళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా బీఎండబ్ల్యూ ఐ5 ఎమ్60, ఐ7, ఐ7 ఎమ్70, ఐఎక్స్, ఎమ్440ఐ కన్వర్టిబుల్, ఎమ్2 కూపే, ఎమ్4 కాంపిటీషన్, ఎమ్5, ఎక్స్ఎమ్ వంటి అత్యంత లగ్జరీ కార్లను పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తున్నారు. ఈ రెండు విభాగాల కార్లపైనా ధరల పెంపు వర్తించనుంది.
ధరల పెంపుతో షాక్ ఇచ్చినప్పటికీ.. కస్టమర్ల కోసం కంపెనీ ఇటీవల 'సమ్మర్ సర్వీస్ క్యాంపెయిన్ 2026'ను ప్రకటించింది. ఈ క్యాంపెయిన్ కింద కస్టమర్లకు పలు రకాల ఉచిత సేవలను అందిస్తోంది. ఇందులో భాగంగా కార్ల ఎయిర్ కండిషనింగ్ ఫిల్టర్ల తనిఖీ, ఎయిర్ ఫిల్టర్, టైర్ల కండిషన్ తనిఖీలను ఉచితంగా చేస్తున్నారు. అలాగే నాన్-ఎలక్ట్రిక్ (పెట్రోల్/డీజిల్) మోడళ్ల కార్ల కోసం ఉచిత బ్యాటరీ చెకప్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ప్రయాణంలో కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ముందుగానే లోపాలను గుర్తించేందుకు ఈ ఉచిత తనిఖీలు ఉపయోగపడతాయని కంపెనీ వెల్లడించింది.
ఉచిత తనిఖీలతో పాటు సర్వీసింగ్ ఖర్చులపై కూడా బీఎండబ్ల్యూ ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఏసీ ప్యుమిగేషన్ సర్వీస్పై కస్టమర్లకు 10 శాతం తగ్గింపు లభిస్తుండగా.. ఎయిర్ కండిషనింగ్ రిపేరింగ్కు సంబంధించి లేబర్ ఛార్జీలపై ఏకంగా 25 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నారు. ధరలు పెరగడానికి ముందే కొత్త కారును సొంతం చేసుకోవాలనుకునే వారు ఈ జూన్ నెలలోనే కొనుగోలు చేయడం ఉత్తమమని ఆటోమొబైల్ నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications