2018 బడ్జెట్: జైట్లీజీ! ఎకోసిస్టమ్కు ప్రాధాన్యం ఇస్తారా? ఆటోమొబైల్ జీఎస్టీని రెండు శ్లాబ్ల్లోకి మ
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ రంగ పరిశ్రమ మార్కెట్లో అంతర్జాతీయంగా వివిధ దేశాలతో పోలిస్తే భారత్ టాప్ టెన్లో ఉన్నది. ప్రపంచంలోనే భారతదేశానికి ఐదో స్థానం. అత్యధిక ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు ఉత్పత్తయ్యేది ఇక్కడే.. బస్సులను అత్యధికంగా తయారు చేసే రెండో దేశం భారత్.. ఇలా చెప్పకుంటూ పోతే ఆటోమొబైల్ పరిశ్రమంలో ఏ విభాగంలోనైనా భారత్ పదోస్థానం లోపే. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఏడు శాతం వాటా వాహన రంగానిదే..! ఇంత ప్రాధాన్యం ఉన్న ఆటోమొబైల్ రంగం ఇప్పడు ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. గతేడాది జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత భారీగా పన్ను వడ్డింపులు ఆటోమొబైల్ రంగంపైనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలోనే ఆటోమొబైల్ రంగంపై జీఎస్టీని రెండు శ్లాబ్ల్లోకి తేవాలన్న అభ్యర్థన వినిపిస్తోంది. ప్రత్యేకించి ఈసారి బడ్జెట్లో ప్రయాణికుల వాహనాలపై పన్నును రెండు రేట్లకే పరిమితం చేయాలని సియామ్ (భారత ఆటోమొబైల్ తయారీదార్ల సమాఖ్య) కోరుతోంది.
2018 బడ్జెట్లో భారతీయ ప్రజా రవాణా రంగం సరళంగా విద్యుత్ వాహనాల వైపు మళ్లే విధంగా పన్ను విధానం ఉండాలని సియామ్ స్థూలంగా కోరుతోంది. వినియోగదారుల సెంటిమెంట్ను బలోపేతం చేయడంతోపాటు కాలుష్య రహిత విధానాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా వాహనాలపై విధిస్తున్న జీఎస్టీ తదితర సుంకాలను హేతుబద్దీకరించాలని సియామ్ అభ్యర్థిస్తోంది. అయితే తేలిగ్గా ఆదాయం వచ్చే మార్గం గల ఆటోమొబైల్పై ప్రస్తుతం వసూలు చేస్తున్న పన్నులపై రాయితీలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధపడుతుందా? అన్నది అనుమానమే.
కాలుష్య రహిత వాహనాలకు ప్రోత్సాహకాలివ్వండి
వాహన రంగం అంటే చటుక్కున గుర్తొచ్చే అంశం.. కాలుష్యం. దేశంలో పెరుగుతోన్న వాయు కాలుష్యంపై న్యాయస్థానాలు ఎంతో ఆగ్రహంగా ఉన్నాయి. ఈ క్రమంలో విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని పెంచేలా ప్రజలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. తయారీ, అనుబంధ రంగాలు, వాటి సేవలపై ప్రభుత్వం పన్ను మినహాయింపును ప్రకటించవచ్చని ఆటోమొబైల్ పరిశ్రమ ఆశిస్తోంది. ప్రభుత్వమూ ఆ దిశగా సానుకూల సంకేతాలను ఇప్పటికే ఇస్తోంది. ప్రస్తుతం 1200 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న పెట్రోల్ కార్లపై 28శాతం జీఎస్టీ, ఒక శాతం సుంకం విధిస్తున్నారు. 1500 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న డీజిల్ కార్లపై 28శాతం జీఎస్టీ, 3శాతం సుంకం విధిస్తున్నారు. మారిన పన్ను రేట్ల ప్రకారం హైబ్రిడ్, మధ్యశ్రేణి, ఎగువ మధ్యశ్రేణి ఎస్యూవీలపై 43 శాతం నుంచి 50 శాతం వరకు పన్ను చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. వీటన్నిటిని జీఎస్టీ కింద రెండు స్లాబ్లలోకి తీసుకురావాలని 'సియామ్' కోరుతోంది. దీనితో మందగమనంలో ఉన్న వాహన రంగానికి కొంత ఊరట లభిస్తుందని చెబుతోంది.

విద్యుత్ వాహనాలపై రోడ్ టాక్స్ మినహాయించాలి
ఇక సెకండ్హ్యాండ్ కార్ల విషయంలో కొనుగోలు ధరకు.. అమ్మిన ధరకు మధ్య వ్యత్యాసంపై 5శాతం పన్ను విధించాలని ఆటోమొబైల్ పరిశ్రమ కోరుతోంది. ఇది గతంలో చెల్లించిన వ్యాట్ రేటుకు సమానమని పేర్కొంటోంది. ప్రస్తుత జీఎస్టీ ప్రకారం వివిధ రకాల వాహనాలను బట్టి 28 నుంచి 43 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఆదాయ పరంగా ఇది ప్రభుత్వానికి రుచించే అంశం కాదు. కాబట్టి ఎంతవరకూ ఈ వినతికి స్పందిస్తుందో వేచి చూడాలి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి సాధిస్తున్న విద్యుత్ వాహనాల మార్కెట్కు పెద్ద ఎత్తున పన్ను మినహాయింపులు అందివ్వాలన్నది 'సియామ్' అభ్యర్థనల్లో ఒకటి. పూర్తి డబ్బు చెల్లించి కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనానికి మరో 5శాతం జీఎస్టీ మినహాయింపు, 30 శాతం ఇన్కమ్ట్యాక్స్ మినహాయింపు అంటోంది. జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని.. రహదారి పన్నును పూర్తిగా మినహాయించాలని కోరుతోంది. వాహనాల తయారీకి పెద్ద ఎత్తున విడిభాగాలు కావాలి. వాటిల్లో కొన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుని, ఇక్కడ అసెంబుల్ చేసేవి. పూర్తిగా అక్కడే తయారైనవీ ఉంటాయి. ఈ రెండింటికీ కస్టమ్స్ డ్యూటీ విధించే విషయంలో స్పష్టత ఇవ్వాలి. మేక్ ఇన్ ఇండియాకు మద్దతుగా పూర్తిగా దేశీయంగా తయారు చేసిన విద్యుత్ వాహనాలకు, విడి భాగాలకు అదనపు రాయితీలు అందివ్వాలి.












Click it and Unblock the Notifications