ఐర్లాండ్తో వైట్వాష్.. బుడ్డోడి ఎంపికపై తేల్చేసిన కోచ్!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి పూర్తి సిద్ధంగా ఉన్నాడని భారత సహాయ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ స్పష్టం చేశారు. అయితే తుది జట్టులో చోటు దక్కించుకునేందుకు వైభవ్ కూడా మిగతా ఆటగాళ్లలాగే ఓ నిర్ణీత ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఐర్లాండ్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్ కోసం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ.. తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రపంచ ఛాంపియన్గా ఉన్న భారత జట్టు ఈ సిరీస్లో ఐర్లాండ్ చేతిలో 0-2తో వైట్ వాష్కు గురికావడం.. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడంతో మా చర్చ మరింత ముదిరింది.
మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశళంలో వైభవ్ సూర్యవంశీ డెబ్యూ గురించి అడిగిన ప్రశ్నకు ర్యాన్ టెన్ డోస్చేట్ సమాధానం చెప్పారు. "వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ 3 నెలల క్రితం మనం ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషంచిన సంజు శాంసన్ లాంటి ఆటగాళ్లు కూడా జట్టులో ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లోనూ మంచి ప్రదర్శన చేశాడు. జట్టులోని ఆటగాళ్లకు సుదీర్ఘ అవకాశాలు ఇస్తూ.. వారి ఆత్మవిశ్వాసాన్ని నింపడం చాలా ముఖ్యం. వైభవ్ బ్యాటింగ్ చూడాలని మేమంతా ఉత్సాహంగా ఉన్నాం. కానీ వైభవ్ కూడా అదే ప్రక్రియను దాటి రావాలి. వైభవ్ ప్రతిభపై మాకు ఎలాంటి అనుమానాలు లేవు" అంటూ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ స్పష్టం చేశారు. ఈ సిరీస్ ప్రారంభంలో బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఆయన కూడా వ్యక్తం చేశారు.

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ 230కి పైగా అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సీజన్ మొత్తం 776 పరుగులు సాధించిన ఈ యువ సెన్షేషన్ 'మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్'తో పాటు 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్' అవార్డులను కూడా కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్లో అంతటి అద్భుత ప్రదర్శన చేయడం వల్లే వైభవ్ సూర్యవంశీని అంతర్జాతీయ జట్టులో చూడాలని అభిమానులు ఆరాటపడుతున్నారు.
ఐర్లాండ్ సిరీస్ ముగియడంతో భారత్ ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. జులై 1 నుంచి చెస్టర్-లీ-స్ట్రీట్లో ఇంగ్లాండ్ జట్టుతో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలోనైనా వైభవ్ సూర్యవంశీకి ఆడే అవకాశం దక్కుతుందా అనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ ఇంగ్లాండ్ సిరీస్లో వైభవ్ సూర్యవంశీ గనుక అరంగేట్రం చేస్తే భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అంతర్జాతీయ ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఈ రికార్డు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్(16 ఏళ్ల వయసులో అరంగేట్రం) పేరిట ఉంది. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంతో సచిన్ రికార్డు బ్రేక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications